షాద్నగర్టౌన్, జూలై 9: సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రతి మనిషిలోని అవయవాల్లో అత్యంత ప్రధానమైనవి కండ్లు. మనం ఏది చేయాలన్న, ఏది చూడాలన్న, ఏదైనా గుర్తు పట్టాలన్న, ప్రకృతి ఆస్వాదించాలన్న, ప్రపంచాన్ని చుట్టేయాలన్నా కండ్లు ఎంతో ముఖ్యం. అలాంటి కండ్ల పట్ల జాగ్రత్త అవసరం. గతంలో కంటి సమస్యలతో బాధపడేవారు కార్పొరేట్ స్థాయిలో వైద్యం చేయించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వేలాది రూపాయలను ఖర్చు చేసినా కండ్లు సరిగా కనబడేవి కావు. ఖర్చు చేసి కంటి పరీక్షలు చేయించుకున్నా ఎలాంటి ఫలితం లేదని, వారు ఇచ్చిన అద్దాలనే వాడుతూ కాలం గడిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేలా ప్రభుత్వ దవాఖానలను తీర్చిదిద్దింది. ప్రభుత్వ దవాఖానల్లో ఆధునిక పరికరాలతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నది. అంధత్వం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం 2023 జనవరి 18న రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కంటి వైద్య నిపుణులతో పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా కంటి వెలుగు వైద్య శిబిరాలలో కండ్లలో శుక్లం, పొర, నల్లగుడ్డు మీద పొర, మోతియ బిందువు, నరం వల్ల అంధత్వం, నీటి కాసులు, మెల్ల కన్ను, చూపు లోపాల వంటి సమస్యలకు వైద్యం అందించారు.
షాద్నగర్ నియోజకవర్గంలో
దృష్టి లోపాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 2018 ఆగస్టు 15నుంచి 198రోజుల పాటు నిర్వహించిన మొదటి విడుత కంటి వెలుగుకు 1,78,367మంది సద్వినియోగం చేసుకోగా 2023 జనవరి 18 నుంచి 100రోజుల పాటు నిర్వహించిన రెండవ విడుత కంటి వెలుగు శిబిరంలో 1,44,898 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 16, 745 మందికి కంటి అద్దాలు ఇవ్వడంతో పాటు 12,632 మందికి అద్దాలను అందజేసేందుకు వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయడం, 17194మందిని కంటి ఆపరేషన్ల కోసం రెఫర్ చేశారు.
కంటి అద్దాలు బాగున్నాయి
కంటి వెలుగు వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్నా. పరీక్ష చేసిన వెంటనే కంటి అద్దాలు ఇచ్చారు. నాకు ఇచ్చిన కంటి అద్దాలు బాగున్నాయి. కార్పొరేట్స్థాయిలో కంటి పరీక్షలు చేశారు. ఇలాంటి పథకాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అంధత్వ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– చంద్రకళ, గాంధీనగర్కాలనీ, షాద్నగర్
10 బృందాలతో వైద్య శిబిరాలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కంటి వెలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. నియోజకవర్గంలో 100రోజుల పాటు 10బృందాలతో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాం. కంటి పరీక్షలు చేయడంతో పాటు అద్దాలను అందజేశాం. ఆపరేషన్ అవసరమైన వారిని రెఫర్ చేశాం.
– జయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వో, షాద్నగర్