షాబాద్, మార్చి 10 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 80 కేంద్రాల్లో శుక్రవారం 15,690 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. 1,356 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,047 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
బొంరాస్పేట : జిల్లాలో 5300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 859 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేశారు. 716 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 212 గ్రామాలు, 45 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
సీఎం సారుకు రుణపడి ఉంటాం : రాములమ్మ, చేవెళ్ల
గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల పాలనలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టలేదు. గతంలో కంటి పరీక్షల కోసం నగరానికి వెళ్లాలంటే ఎంతో ఇబ్బందిపడేవాళ్లం. కేసీఆర్ సారు గ్రామంలో కంటి వెలుగు ఏర్పాటు చేసిండ్రు. డాక్టర్లు ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అద్దాలు, మందులు అందజేస్తున్నారు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.