షాద్నగర్టౌన్, జూన్ 25: తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల అధికారులు, స్థానిక వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్ దుకాణాల్లో విస్తృతస్థాయిలో తనిఖీలు చేపడుతూ నకిలీల భరతం పడుతున్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల అధికారులతో పాటు వ్యవసాయాధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేస్తూ రికార్డులను పరిశీలిస్తున్నారు. విత్తనాలకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దని, లైసెన్స్ లేకుండా విక్రయాలు జరపొద్దని సూచిస్తున్నారు. అప్రమత్తతతోనే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉంటారని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల షాద్నగర్ పరిసరాల్లో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పటుకొని అతని నుంచి రూ.40లక్షల విలువైన 1.5టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు పలు సూచనలు చేశారు.
నకిలీ విత్తనాలపై పట్టణాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాం. రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు. విత్తనాలకు సంబంధించి ఎలాంటి సందేహం ఉన్న అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలి. విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను వ్యాపారులు విక్రయించొద్దు. విత్తనాలతో పాటు ప్యాకెట్పై ప్రభుత్వ లేబుళ్లను క్షణ్ణంగా పరిశీలించాలి.
– నిశాంత్కుమార్, ఫరూఖ్నగర్ మండల వ్యవసాయాధికారి, షాద్నగర్
విత్తనాల కొనుగోలులోరైతులు అప్రమత్తంగా ఉండాలి. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. కంపెనీ విత్తనాలు కాకుండా సంచుల్లో తీసుకొచ్చి ఎక్కువ దిగుబడి వస్తుందని నమ్మబలికే వారి నుంచి విత్తనాలు కొనొద్దు. ఎవరైన సంచుల్లో విత్తనాలను విక్రయిస్తూ కనబడితే అధికారులకు ఫిర్యాదు చేయాలి. విత్తనాలను కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా రసీదు తీసుకోవాలి. మొక్క ఎదుగుదల, కాత, పూతలో తేడా వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
– రాజారత్నం, ఏడీఏ, షాద్నగర్