“సీఎం కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి మరోసారి ఇబ్రహీంపట్నం టికెట్ కేటాయించడం సంతోషంగా ఉన్నది.. సీఎం నేతృత్వంలో ఐదేండ్లుగా నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్నా.. మళ్లీ విజయఢంకా మోగించి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ” అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మరోసారి బీఆర్ఎస్ సీటు లభించడంపై ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూ నిర్వహించగా వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఉమ్మడి రాష్ట్రంలో సరిగా నిధులందక ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిధులులేక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతికి అడ్డాగా మారింది. ఫార్మాసిటీ, ఫాక్స్కాన్ వంటి కార్పొరేట్ కంపెనీలకు నిలయంగా మారింది. ఫలితంగా ఉద్యోగవకాశాలు మెరుగుపడుతున్నాయి. గడప గడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు బాగుపడ్డాయి. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. విజయం సాధించారు. గత 15 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసి చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు గత మూడుసార్లు ఎన్నికల్లో ఆశీర్వదించడం వల్ల విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థిగా కచ్చితంగా గెలుస్తానని మంచిరెడ్డి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, ఆగస్టు 23
ఎమ్మెల్యే : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్ చుట్టున్నప్పటికీ నిధులు లేక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఐటీ, ఎరోస్పేస్, రక్షణరంగ సంస్థలు, విద్యారంగ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. వీటికి తోడు ఫార్మాసిటీ కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటైంది, అనేక ఔషధరంగ సంస్థల ఏర్పాటుకూ ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయం కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఏర్పాటు కావడంతో ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఫాక్స్కాన్ కంపెనీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే ఏర్పాటు కావడంతో ఎక్కువ మంది యువతీయువకులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరిన్ని సంస్థలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం.
ఎమ్మెల్యే : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, విద్యుత్ సరఫరాతో పాటు అన్ని కులాల వారీగా కమ్యూనిటీ భవనాలు నిర్మించడం జరిగింది. అలాగే, వివిధ ప్రాంతాలు, గ్రామాలను కలిపి రవాణా మార్గాన్ని మరింత మెరుగుపర్చటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, షాదీముభారక్, కేసీఆర్కిట్టు, న్యూట్రీషన్కిట్లు, మిషన్భగీరథ వంటి పథకాలు ప్రతి ఇంటికి అందాయి. అభివృద్ధి, సంక్షేమం ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి దగ్గరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి స్పందన ఉన్నది.
ఎమ్మెల్యే : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ మరింత విశ్వాసం బలపడుతున్నది. ప్రజల కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించాలని దృఢసంకల్పంతో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం రెట్టింపైంది. ఈ విశ్వాసంతోనే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న అభిమానంతో ప్రజలు ఉన్నారు.