కొత్తగూడెం, జూలై 30 : కొత్తగూడెం పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది రజాక్ (65) మృతి చెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రజాక్తో కలిసి తాను ఎల్.ఎల్.బి చదువుకున్న రోజులు ఇప్పటికీ మధుర జ్ఞాపకాలుగా మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఎన్నో దశాబ్దాల పాటు కొనసాగిందని, మంచి స్నేహితుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిగా రజాక్ సమాజానికి విశేష సేవలు అందించారని, ఆయన నిరాడంబర స్వభావం, మానవతా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. రజాక్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, రజాక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.