రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు, ఎరువులు తదితరాలను కొనుగోలు చేస్తూ.. సంబురంగా సాగు చేసుకుంటున్నారు. ఇప్పటివర కు పది విడుతలుగా ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందించగా.. పదకొండో విడుతకు అధికారులు సన్నద్ధమయ్యారు. వానకాలం పంటకు సంబంధించి నేటి (సోమవారం) నుంచి డబ్బులు రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ కానుండగా.. పది రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. రంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్కుగాను 3,94,066 మంది రైతులకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయంగా రూ.378.95 కోట్ల సాయం అందనున్నది. అయితే కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులకూ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో..గత యాసంగి సీజన్తో పోలిస్తే ఈ వానకాలం సీజన్లో కొత్తగా 39,967 మంది రైతులు ఈ పథకం కింద అర్హులుగా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. గత పది విడుతలుగా జిల్లాలోని రైతులకు ప్రభుత్వం రూ.3,017.91 కోట్లను అందించింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 2,88,834 మంది రైతులకు రూ.322 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించనున్నది. అలాగే ఈ వానకాలంలో కొత్తగా 27,000 మందికి రైతుబంధు వర్తించనున్నది. ఇప్పటివరకు జిల్లాలోని రైతాంగానికి రూ.2,622 కోట్లు పెట్టుబడి సాయంగా అందింది. కాగా నేడు ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు రూ.5 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నది. కాగా.. ఈసారి పోడు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనున్నది. బ్యాంకులు, వడ్డీవ్యాపారుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పడం, అదునుకు ముందే డబ్బులు వస్తుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తొలకరి జల్లులు కురిసింది మొదలు.. దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం రైతులకు పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగు బాట పట్టాల్సి వస్తున్నది. ఈ కష్టాల నుంచి రైతులను గట్టెక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. రైతుల కష్టాలను దూరం చేసి వారి మోముల్లో చిరునవ్వులు చిందించేందుకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నది. 2018 వానకాలం సాగు నుంచి ప్రారంభమైన రైతు బంధు పథకాన్ని పది విడుతలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యవసాయాధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల బ్యాంకు ఖాతా తదితర వివరాలను ట్రెజరీ అధికారులకు సమర్పించారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రస్తుత వానకాలం సాగుకు 11వ విడుత సాయం అందించి రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించనున్నారు. సోమవారం ఎకరాలోపు రైతులకు సాయం అందనుంది. అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ కానుండడంతో జిల్లా రైతాంగం సంబురపడుతున్నది.
చిరు జల్లుల కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గత రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలతో రైతులు సాగు బాట పట్టారు. దుక్కులు దున్నుకుని విత్తనాలను విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. పెట్టుబడి కోసం బ్యాంకులనో, వడ్డీ వ్యాపారులనో ఆశ్రయించే అవసరం లేకుండా ప్రభుత్వం సీజన్కు ముందే రైతు బంధు సాయాన్ని అందిస్తుండడంతో రైతులు సంబురంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. రైతులకు సరిపోను విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది.
రంగారెడ్డి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా 3,94,066 మంది రైతులకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రూ.378.95 కోట్లు అందజేయనుంది. గత పది విడుతల్లో జిల్లాలో రైతాంగానికి రూ.3,017.91కోట్ల సాయాన్ని ప్రభుత్వం అందించింది. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులకు కూడా 11వ విడుతలో పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో వానకాలం సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసి ఉంచింది. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా 39,967 మందికి రైతు బంధు సాయం అందనుంది. విడుతలవారీగా రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ పెట్టుబడి సాయాన్ని అందించనున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
సంవత్సరం సీజన్ రైతులు సాయం
(రూ.కోట్లలో)
2018-19 వానకాలం 2,47,694 255.29
యాసంగి 2,21,116 240.46
2019-20 వానకాలం 2,30,155 257.16
యాసంగి 2,11,994 208.96
2020-21 వానకాలం 2,69,077 342.91
యాసంగి 2,74,785 344.36
2021-22 వానకాలం 2,82,646 343.96
యాసంగి 2,93,599 343.86
2022-23 వానకాలం 3,04,167 344.39
యాసంగి 2,98,818 336.51
వికారాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో 2,88,834 మంది రైతులకు రైతుబంధు సాయం రూ.322 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం జమ చేయనుంది. జిల్లాలో ఎకరాలోపు భూమిగల దాదాపు 70 వేల మంది రైతులకు నేడు రైతు బంధు సాయమందనుంది. యాసంగి సీజన్తో పోలిస్తే వానకాలం సీజన్కు కొత్తగా 27 వేల మంది రైతులు రైతు బంధు అర్హులుగా చేరినట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. గత యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్ల సాయాన్ని రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో పంట రుణాలకు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే రోజులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతు బంధు పథకం కింద ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2622 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది.
సంవత్సరం సీజన్ రైతులు సాయం
(రూ.కోట్లలో)
2018-19 వానకాలం 1,94,833 221
యాసంగి 1,75,989 206
2019-20 వానకాలం 1,78,998 255
యాసంగి 1,71,824 194
2020-21 వానకాలం 2,13,341 297
యాసంగి 2,19,264 301
2021-22 వానకాలం 2,25,438 300
యాసంగి 2,24,928 241
2022-23 వానకాలం 2,47,707 305 యాసంగి 2,43,447 299
రైతు బంధుకు సంబంధించి యాసంగి సీజన్కు అర్హుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం. నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం డబ్బులు నేరుగా జమ కానున్నాయి. ఇప్పటికే 1.50 లక్షల మంది రైతులకు సంబంధించిన వివరాలు ట్రెజరీకి చేరాయి. అర్హులైన ప్రతి రైతుకు సాయం అందుతుంది.
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి