రంగారెడ్డి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) :కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రగతిని సాధించింది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోనే పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో స్థానికులతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు ఉపాధి పొందుతున్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా సులభతరంగా అనుమతులు లభిస్తుండడంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 323 పరిశ్రమల ఏర్పాటుకు సంబంధిత శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. రూ.16,399.30 కోట్ల పెట్టుబడులతో 28,528 మందికి ఉద్యోగ, అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఏడాదిలోనే కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి.
సులభతర అనుమతులు..
పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన టీఎస్ఐపాస్తో అనుమతులు సులభతరమయ్యాయి. అన్నీ సజావుగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులొచ్చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడడం.. శాంతి భద్రతల సమస్యలు లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు గ్రామీణ జిల్లాల వైపు సైతం మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా.. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడ్డ రంగారెడ్డి జిల్లాలో నేడు పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో జిల్లా ఆకర్షణీయ గమ్యస్థానమైంది.
ప్రస్తుతం 5.15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 3వేల 328 కోట్ల పెట్టుబడులతో 2,777 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో కేవలం 45,763 మందికి మాత్రమే ఉపాధి కల్పించబడింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం జిల్లాలో 47 వేల 62 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5,15,851 మందికి ఉపాధి కల్పించబడుతున్నది. ప్రముఖ సంస్థలైన ఫాక్స్ కాన్, గూగుల్, బోయింగ్, విప్రో, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంట్, ఓరియంట్, అస్ట్రాల్ వంటి పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మారుమూల ప్రాంతమైన చందనవెల్లి పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులో ఐదేండ్లలోనే రూ.13,508 కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఏర్పాటై 3,210 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వెల్స్పన్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఓలెక్ట్రా గ్రీన్టెక్, దైఫుకు, నికోమాక్ తైకిషా, కిటెక్స్ వంటి మెగా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే కొలువుదీరాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండగల్ వద్ద రూ.650 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉత్పత్తులను సైతం మొదలుపెట్టింది.
త్వరితగతిన అనుమతులు..
పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా ఉంటే అనుమతులు వెంటనే జారీ చేస్తున్నాం. మిగతా శాఖలు జాప్యం లేకుండా అనుమతులు ఇచ్చేలా చూస్తున్నాం. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కోసం కొత్తగా 323 దరఖాస్తులు వచ్చాయి. వీటి ఏర్పాటుతో ఈ ఏడాది మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
– రాజేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్,