వికారాబాద్, ఫిబ్రవరి 15 : వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) యంత్రాల మొదటి దశ పరిశీలన(ఎఫ్ఎల్సీ) పూర్తి కావడంతో గురువారం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాక్ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంల మొదటి దశ పరిశీలన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈసీఐఎల్కు చెందిన సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం ముగిసింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి మొదలైన ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నమన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యా ట్ల మొదటి దశ పరిశీలన పూర్తైందన్నారు. మాక్ పోల్ ఓటింగ్లో వివిధ పార్టీల ప్రతినిధులు , ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.