లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ‘సీ’ విజిల్కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా అన్ని రకాల ఘటనలపై యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో జిల్లాలో చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై నిఘా మొదలైంది. నామినేషన్ల పర్వం నుంచే ఈ ప్రక్రియ మొదలుకానుండగా.. సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకులుగా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్కు సంబంధించిన అధికారులు సెంథిల్ కుమారన్, రాజీవ్ చావ్రాలను నియమించింది.
ఇప్పటికే వీరు ఎస్ఎస్టీ, వీఎస్టీ, ఎంసీసీ, అకౌంటింగ్ టీం సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల్లో నిర్వర్తించాల్సిన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు రూ.70లక్షలు ఉండగా.. ప్రస్తుత ఎన్నికల్లో రూ.90 లక్షలకు మించి ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం నిర్దేశించింది. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలు, భోజనాలు, వాహనాలు, ఎన్నికల సామగ్రికి సంబంధించిన అన్ని ఖర్చులను నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి.
లోక్ సభ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఈ నెల 19 వరకు ‘సీ’ విజిల్ యాప్ ద్వారా 80 ఫిర్యాదులు వచ్చాయి. కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 16 నుంచే ఈ యాప్ను చాలామంది ఉపయోగించుకోవడం విశేషం. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచే 33 వరకు ఫిర్యాదులు అధికారులకు అందాయి. అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి ఘటనలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు రాగా.
డబ్బుల పంపిణీ, అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాల వినియోగం తదితర వాటికి సంబంధించి కూడా ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వైలెన్స్, రిజర్వ్ బృందాలు రంగంలోకి దిగి వివరాలు సేకరించి రిటర్నింగ్ అధికారికి నివేదించాయి. ఇలా.. ఫిర్యాదు చేసిన వంద నిమిషాల్లోనే అన్ని ఫిర్యాదులను పరిష్కరించినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.