బడంగ్పేట, నవంబర్ 30 : మహేశ్వరం నియోజక వర్గం వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు భారీ క్యూలో జనం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపారు. ఉదయం 9గంటలకు 5శాతం, 11గంటలకు 12.83 శాతం, 3 గంటలకు 39.47 శాతం పోలింగ్ అయింది. మధ్నాహ్నం నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 90 ఏండ్ల వృద్ధురాలిని తీసుకొచ్చి ఓట్లు వేయించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని అధికారులను అడిగి విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలుసుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. ఓటర్లు మంత్రితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. జిల్లెలగూడ, మీర్పేట, బడంగ్పేట, బాలాపూర్, జల్పల్లి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో మంత్రి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు.
మొదటి సారిగా ఓటు వేశాను. చాలా థ్రిల్గా అనిపించింది. పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత కొత్తగా అనిపించింది. ఓటు హక్కును వినిగియోగించుకున్నాను. మా ఫెండ్స్కు చాలా మందికి ఈ సారి ఓటు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలనిపించింది.
– భారత రత్న
మొదటిసారి ఓటు వేయడానికి అవకాశం వచ్చింది. ఓటు హక్కును వినియోగించుకోవాలని వేరే రాష్ట్రం నుంచి వచ్చాను. ఓటు వేయడం మన కర్తవ్యం. కొత్తగా ఓటు హక్కు వినియోగించు కోవడం సంతోషంగా ఉంది. మంచి చెడులను గ్రహించి ఓటు వేశాను. నేను ఓటు అనుకున్న గుర్తుకు వేసినందుకు తృప్తిగా ఉంది.
– సాయి కీర్తి