మహేశ్వరం, జూలై 6: అర్హులైన పేదలందరికీ ఇండ్ల పట్టాలు అందిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల పరిధిలోని గట్టుపల్లిలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను జడ్పీచైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చే క్రమంలో భాగంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. గ్రామాల్లో లే అవుట్లు ఏర్పాటు చేసి అర్హులైన వారికి లాటరీ పద్ధతి ద్వారా స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సొంత జాగ ఉన్న వారికి ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున గృహలక్ష్మి పథకం కింద సాయం అందించనున్నట్లు తెలిపారు.