చేవెళ్ల టౌన్/చేవెళ్ల రూరల్/శంకర్పల్లి/మొయినాబాద్: చేవెళ్ల ప్రజలకు ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని విద్యాశాఖ మంత్రి పి. సబితారెడ్డి అన్నారు. బుధవారం మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని మంత్రి స్వగ్రామం కౌకుంట్లలో ఇంద్రారెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. చేవెళ్ల మండల కేంద్రంలో, మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి, శంకర్పల్లి మండలం మహారాజ్పేట్, జన్వాడ తదితర గ్రామాల్లో ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మంత్రి కుమారులు కౌశిక్రెడ్డి, కల్యాణ్రెడ్డిలతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన ఇంద్రారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఉన్నత పదవులను అధిరోహించి, పేదల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేశారని గుర్తు చేశారు. ఇంద్రారెడ్డి ఆశయసాధన దిశగా అడుగులు వేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నానని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదాన్ని కూడా ఉచ్ఛరించడానికి భయపడిన రోజుల్లో స్వర్గీయ ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపించిన మహానాయకుడని అన్నారు.
శంకర్పల్లి మండలం జన్వాడలో స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించి అంద రి హృదయాల్లో ఇంద్రారెడ్డి నిలిచారన్నారు. ఎందరో నాయకులను తీర్చిదిద్దిన మహానేత పేరును చేవెళ్ల నియోజకవర్గానికి పెట్టేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇంద్రారెడ్డి స్ఫూర్తిని ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్లలో రాజకీయ యంత్రాలను తయారు చేసిన గొప్ప యోధుడు ఇంద్రన్న అని చెప్పారు. రాజకీయాల్లో ఇంద్రారెడ్డి మార్గదర్శకులు అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఇంద్రన్న ఆనాడే ఎమ్మెల్యే అవుతానని తన గురించి చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందరూ ఇంద్రన్న శిష్యులే ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీపీలు విజయలక్ష్మి, గోవర్ధ్దన్రెడ్డి, నక్షత్రం, జడ్పీటీసీలు కాలె శ్రీకాంత్, మర్పల్లి మాలతి, గోవిందమ్మ, వైస్ ఎంపీపీలు శివప్రసాద్, మమత, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, బీఆర్ఎస్ ఆయా మండలాల అధ్యక్షులు ప్రభాకర్, మహేందర్రెడ్డి, గోపాల్, వాసుదేవ్కన్నా, సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, వెంకట్రెడ్డి, నాగార్జునరెడ్డి, జయవంత్, రవూఫ్, డప్పు రాజు, కావలి ప్రవీణ్, సర్పంచ్లు నరోత్తంరెడ్డి, స్వరూప, వినీత, కుమార్, గాయత్రి, సులోచన, ఎంపీటీసీ అంజయ్య, సుధాకర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.