బడంగ్పేట, అక్టోబర్ 7: కోట్లాది రూపాయలతో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ల రూపురేఖలను మార్చుతున్నట్లు విద్యాశాఖ మంత్రి పి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆమె సుడిగాలి పర్యటన చేసి బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒకే రోజు రూ.75 కోట్ల నిధులతో చేపట్టనున్న, నిర్మాణం పూర్తైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 16, 17, 18, 19, 21, 31 డివిజన్లలో రూ.3.19 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.9.2 కోట్లతో నిర్మించిన బడంగ్పేట నూతన మున్సిపల్ కార్పొరేష న్ భవన ప్రారంభం.. అదేవిధంగా రూ.4.25 కోట్లతో ప్రజాభవనం, రూ. 2.40 కోట్లతో కుర్మల్గూడలో 24 కుల సంఘాల భవనాలకు, రూ.4.72 కోట్లతో కుర్మల్గూడలో డీఆర్సీ సెంటర్, నాదర్గుల్లో దోబీఘాట్ తదిత ర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక నిధులను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో కుల వృత్తులను అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చారని, మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలను రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిం చిందని..కులమతాలకతీతంగా పనిచేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకా రంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
చెరువుల సుందరీకరణ, నాలాల అభివృద్ధితోపాటు రోడ్ల విస్తరణ, అర్బన్ పార్కుల ఏర్పాటు, పేదలకు మెరుగైన వైద్యంకోసం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖానలను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గానికి మెడికల్ కళాశాలనూ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనిచేస్తున్నామని.. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల అమలు కాని హామీలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. ఆయా కార్యక్రమాల్లో బడంగ్పేట మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ సుమన్రావు, కార్పొరేటర్ అర్జున్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.