షాబాద్, జనవరి 20 : పదోతరగతి పరీక్షల్లో ఈ ఏడాది మెరుగైన ఫలితాలను సాధించేందుకు విద్యాశాఖ పక్కాప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రతిసారి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుల్లో అధిక మొత్తంలో విద్యార్థులు ఫెయిలవుతుండడంతో వీటిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
విద్యార్థుల మేధస్సును బట్టి మూడు గ్రూపులుగా విభజించి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి పదోతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్లిప్ టెస్టులతోపాటు మోడల్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థుల్లోని భయాన్ని పోగొట్టి భరోసా నింపుతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు స్పెషల్ క్లాస్లు నిర్వహిస్తున్నారు.
రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా అభ్యాస దీపికలను కూడా అందజేశారు. గతంలోని ప్రశ్నాపత్రాలపై విద్యార్థులతో కసరత్తు చేయిస్తున్నారు. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో 50,287 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానుండగా, వికారాబాద్ జిల్లాలో 13,074 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో వందశాతం సిలబస్ పూర్తికాగా, రంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ నాటికి 70 శాతానికి పైగా సిలబస్ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు వందశాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా, మార్చిలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఒత్తిడిని తట్టుకుని పరీక్షలు రాసేలా ఇప్పటినుంచే విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఉత్తమ గ్రేడ్లు సాధించేలా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెళకువలు నేర్పుతున్నారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలో 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రత్యేక తరగతుల ద్వారా మా ఉపాధ్యాయులు అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలో ఉదయం గంట, సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు ఒక సబ్జెక్టుపై సార్ వాళ్లు మాకు పాఠాలు బోధిస్తున్నారు. మాకు ఏమైనా సందేహాలు ఉన్నా సార్ వాళ్ల దృష్టికి తీసుకువెళితే పరిష్కరిస్తున్నారు.
-వైష్ణవి, పదవ తరగతి, తెలంగాణ మాడల్ పాఠశాల, షాబాద్
మా పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకో సబ్జెక్టు ద్వారా పరీక్షలపై పాఠాలు బోధించి మా ఉపాధ్యాయులు మాకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక తరగతులు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తాను.
-కార్తీక్, పదవ తరగతి, తెలంగాణ మోడల్ పాఠశాల, షాబాద్
పదోతరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. సబ్జెక్టుల వారీగా సందేహాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సిలబస్ ప్రకారం బోధిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాం.
-సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో
పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాం. నవంబర్ 10 నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ప్రతి సబ్జెక్టుకు మోడల్ పేపర్లను తయారు చేసి టెస్ట్లను కూడా నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించేలా చూస్తున్నాం.
-రేణుకాదేవి, వికారాబాద్ డీఈవో