రంగారెడ్డి, జూలై 25 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏలను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమున్నత గౌరవం కల్పించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఆయన. వీఆర్ఏల కుటుంబాలు జీవితాంతం సీఎంను గుండెల్లో పెట్టుకుని పూజిస్తాయని వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ ఎడ్ల వెంకటేశ్ ముదిరాజ్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులం అవుతామని కలలో కూడా ఏనాడూ ఊహించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు వీఆర్ఏల కుటుంబ సభ్యులతో రాష్ట్రస్థాయిలో భారీ సభను నిర్వహించేందుకు అన్ని జిల్లాల జేఏసీలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వీఆర్ఏలను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ శాఖల్లోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
చారిత్రక నిర్ణయం..
వీఆర్ఏలుగా ఎంతో వివక్షతను ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వాల హయాంలో మాతో ఎక్కువ పనిచేయించుకుని తక్కువ జీతమే ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మేం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వేతనాన్ని రూ.10,500లకు పెంచినారు. పే స్కేల్ ఇస్తామని అప్పట్లోనే ప్రకటించిండ్రు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ వీఆర్ఏలకు భోజనాలు పెట్టిమరీ మా కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఎవ్వరం ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పే స్కేల్ ఉద్యోగాలు కల్పించనారు. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమే.
ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు..
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేసి మా ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారు. జిల్లాలో మొత్తం 866 వీఆర్ఏ పోస్టులు ఉంటే ప్రస్తుతం 590 మంది పనిచేస్తున్నరు. డిగ్రీ చదివిన వాళ్లు 42 మంది ఉన్నరు. ఇంటర్ చదివినోళ్లు వంద మంది వరకు ఉంటరు. పదో తరగతి పూర్తయిన వారు రెండొందల మంది ఉంటే మిగతావాళ్లు అంతకంటే తక్కువనే చదువుకున్నరు.
జీవితాంతం రుణపడి ఉంటాం..
చాలీ చాలని జీతంతో మా కుటుంబాలు ఇన్నాండ్లుగా ఇబ్బందులు పడుతూ వచ్చాయి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మా జీవితాలకు ఈ రోజు భరోసా కలిగింది. సీఎం సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. జిల్లాలో వీఆర్ఏలమంతా కలిసి సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసినం. వీఆర్ఏల కుటుంబాలతో రాష్ట్ర స్థాయిలో పెద్ద సభ నిర్వహించి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు అన్ని జిల్లాల జేఏసీలం సమాలోచనలు చేస్తున్నాం. త్వరలోనే సభను నిర్వహిస్తాం.