ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 12 : జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు గతంలో తీవ్ర అవస్థలకు గురయ్యేవారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలలతరబడి తిరిగినా వచ్చేవికావు. ఈ విధానాన్ని పూర్తిగా రూపుమాపి ప్రజలకు సులువుగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు రెండు మూడు రోజుల్లో వచ్చే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. రోజులపాటు నిరీక్షణ అవసరంలేదు. నిన్న మొన్నటి వరకు మాన్యువల్గా జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో బయటకు వస్తాయి.
ఆయా సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు కొద్దిరోజుల్లోనే పత్రాలు వస్తాయి. పంచాయతీరాజ్శాఖ సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేసింది. తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలు కులం, ఆదాయం సర్టిఫికెట్లు దరఖాస్తు చేసుకున్న మాదిరిగా స్థానికంగా ఉన్న మీసేవాలో దరఖాస్తు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకం చేసి, పూర్తి వివరాలు పరిశీలించి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నూతన విధానం..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడి మొబైల్కు ఐప్లె చేసిన వివరాలు మెసేజ్ రూపంలో అందుతుంది. ధ్రువపత్రం జారీపై అప్డేట్స్ వస్తాయి. ధ్రువపత్రం జారీ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు దరఖాస్తుదారులు మీసేవా కేంద్రానికి వెళ్లి పత్రాలు తీసుకోవచ్చు. ఇకపై ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
కార్యదర్శులకు డిజిటల్ కీ..
పంచాయతీ కార్యదర్శులు ఇక నుంచి పంచాయతీ కార్యాలయాల ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు వారికి మండల పరిషత్ కార్యాలయం నుంచి సర్కార్ డిజిటల్ కీ ఇచ్చింది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మండలస్థాయిలో ఎంపీడీవోల నేతృత్వంలో మండల పంచాయతీ అధికారులు సూపర్వైజ్ చేస్తారు.
పౌర సేవల్లో పారదర్శకత..
పౌర సేవల్లో పారదర్శకత తీసుకువచ్చి, ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్ల బెడదను నివారించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నది. గ్రామీణప్రాంత ప్రజలకు సులువైన పద్ధతిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల వివరాలు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా సులువుగా నిర్వహిస్తున్న ఈ విధానంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధ్రువీకరణ పత్రాలు జారీకానున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 558 గ్రామపంచాయతీలు..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 558గ్రామపంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీలో పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల నుంచి ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉండేది. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగలేక తీవ్ర అవస్థలకు గురయ్యేవారు. ఈ ఇబ్బందులు ప్రజలు ఇకపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామపంచాయతీల్లోనే పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ డిజిటల్ విధానాన్ని అమలులోకి తీసుకురావటంతో పారదర్శకతకు బాటలు వేసినట్లయ్యింది.
గ్రామపంచాయతీల్లోనే పత్రాలు
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగానే పంచాయతీలకు కొన్ని అధికారాలు కేటాయించింది. ఇక నుంచి పంచాయతీ కార్యదర్శులే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేసే అధికారం కేటాయించింది. డిజిటల్ కీ విధానానికి శ్రీకారం చుట్టి ఫోర్జరీలు, నకిలీల బెడద లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే వారంరోజులలోపు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు చేతికందుతాయి.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి