రంగారెడ్డి, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : వేసవి రాకముందే కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లతోపాటు జలాశయాల్లోనూ నీటి మట్టాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. గురువారమే ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈనెల 15 వరకు కొనసాగనున్నది. వివిధ శాఖల అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టనున్నారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అన్నిరకాల చర్యలు తీసుకోనున్నారు.
శ్రీశైలం బ్యాక్వాటర్ నుంచి కృష్ణా జలాలను తరలించి నాలుగు ప్లాంట్లలో నీటిని శుద్ధి చేసిన అనంతరం జిల్లాలో తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకంలో నిర్మించిన ట్యాంకులు, పైపులైన్ ద్వారా జిల్లా వ్యా ప్తంగా 1,068 ఆవాసాల పరిధిలోని 2,91,401 నల్లా కనెక్షన్లకు నీటిని అందిస్తున్నారు. అయితే వేసవిలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు అధికారుల బృందం తగు చర్యలు తీసుకోనున్నది.
గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, పైపులైన్లు పరిశీలించి లీకేజీలు ఉంటే గుర్తించి మరమ్మతులు చేపడతారు. కొన్నేండ్లుగా మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా వస్తుండడంతో గ్రామాల్లో బోర్లతో పని లేకుం డా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత బోర్లను సైతం మళ్లీ వినియోగంలోకి తేనున్నారు. అవసరమైతే వ్యవసాయ బోర్లను సైతం అద్దెకు తీసుకోవాలని ప్రభు త్వం సూచించడంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించి రోజువారీగా ప్రభుత్వం నివేదికలను తెప్పించుకుంటున్నది.
స్పెషల్ డ్రైవ్లో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, ఇంజినీర్లు నిత్యం గ్రామాల్లో పర్యటించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలి. గురువారం నుంచి ఈ కార్యక్రమం మొదలవ్వగా..శుక్రవారం శివరాత్రి పండుగ.. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారాలు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆయా ఉద్యోగులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పండుగ రోజు కూడా సెలవు ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో చేపట్టిన పారిశుధ్య ప్రత్యేక కార్యక్రమ సందర్భంగానూ పంచాయతీరాజ్ శాఖ సెలవులను రద్దు చేసింది. స్పెషల్ డ్రైవ్లోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నది. మరోపక్క ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్కు ప్రత్యేక నిధుల కేటాయింపులేవీ జరుపలేదు. ఎమ్మెల్యే కోటా నిధులు లేకుంటే..గ్రామ పంచాయతీల నిధులు వెచ్చించాలని సూచించినట్లు తెలిసింది.