ఆమనగల్లు, జనవరి 11 : పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని డీఆర్డీవో ప్రభాకర్ హెచ్చరించారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో డీఆర్డీవో ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు చేపట్టిన రూ.1,75,28,756 ఖర్చుతో వివిధ రకాల పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పనుల్లో జరిగిన అవకతవకలను వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీడీ సక్రియా నాయక్. అంబుడ్స్మన్ సునీత, ఏవీవో కొండయ్య, ఎంపీడీవో ఫారుక్ హుస్సేన్, ఎస్ఆర్పీ వెంకన్న, ఏపీవో మాధవ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.