సొంత గూడులేని నిరుపేదలకు ఇండ్లు కట్టించి సమాజంలో వారికో గౌరవప్రదమైన స్థానం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ‘డబుల్’ ఇండ్ల నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఇండ్లను అర్హులకు అందించే దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో మొత్తం 8,979 మంది నుంచి దరఖాస్తులు రాగా.. 3,086 మందిని అర్హులుగా గుర్తించారు. మార్చి 16 తరువాత లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 80 గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): డబుల్ బెడ్రూమ్ పథకం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హౌసింగ్ ప్రాజెక్టు. గ్రామీణ ప్రాంతాల్లో రెండు పడకల ఇండ్లు, పట్టణాల్లో అపార్టుమెంట్లలో రెండు బెడ్రూములు, కిచెన్తో కూడిన ఇండ్లు నిర్మించి నిరుపేదలు గౌరవంగా బతికేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 6,637 రెండు పడకల గృహాలు మంజూరయ్యాయి. ఈ గృహాల నిర్మాణానికి 274.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ఇందులో 1705 గృహాలను చేవెళ్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో జిల్లా పంచాయతీరాజ్ శాఖ వారు నిర్మిస్తున్నారు. 4,932 గృహాలను ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నిర్మించేందుకు జిల్లా ఆర్అండ్బీ శాఖ వారికి కేటాయించిన విషయమూ తెలిసిందే. ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల డబుల్ ఇండ్ల నిర్మాణంపై జిల్లా కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందులో భాగంగానే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో 80 గృహాలను లబ్ధిదారులకు కేటాయించారు.
జిల్లాలో మంజూరైన ఇండ్లు 6,637
చేవెళ్ల నియోజకవర్గానికి 1,060 ఇండ్లు మంజూరు కాగా, కల్వకుర్తికి 645, ఇబ్రహీంపట్నానికి 1200, మహేశ్వరానికి 392, రాజేంద్రనగర్కు 240, షాద్నగర్ నియోజకవర్గానికి 3,100 గృహాలు మంజూరయ్యాయి. 6,175 గృహాలకు టెండర్లు పిలువగా.. 2,917 గృహాలకు సంబంధించి టెండర్లు ఆమోదించి, వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇందులో 576 గృహాల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తి చేసుకొని 2,341 గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని గృహాలకు ఇటీవలే నిధులు మంజూరైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటి నిర్మాణ పనులు సైతం త్వరితగతిన పూర్తి కానున్నాయి. ఇప్పటికే 25 కాలనీల్లో నీరు, విద్యుత్, సానిటేషన్, ప్లంబింగ్ తదితర పనులు పూర్తి చేసుకున్న ఇండ్లు లబ్ధిదారులకు పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. పూర్తైన ఇండ్ల కోసం 8,979 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,086 మందిని అర్హులుగా గుర్తించారు.
మార్చిలో ఎంపిక ప్రక్రియ
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్నందున పూర్తి అయిన ఇండ్ల పంపిణీ ప్రక్రియ మరో రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. చాలా నియోజకవర్గాలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వచ్చే నెల 16 తరువాత నిర్వహించనున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల స్థానిక తహసీల్దార్లచే ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా, చాలా చోట్ల కొనసాగాల్సి ఉంది. వేల మంది లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కాగా, వారి పేర్లను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయనున్నారు.
పూర్తైన గృహాలకు త్వరలో ఎంపిక
– రాజేశ్వర్రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్
ఇప్పటికే జిల్లాలో 2,341 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగింది. కాగా, ఇందుకు 8,979 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,086 మందిని అర్హులుగా గుర్తించారు. ఇప్పటివరకు పూర్తైన ఇండ్లను రెండు నెలల్లో లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది. మిగతా నిర్మాణాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే వాటికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి.