పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఆగస్టులో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. హౌసింగ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షించి లబ్ధిదారుల వివరాలను సేకరించనున్నారు. రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతంలో 1464 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 60 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు జిల్లాయంత్రాంగం పేర్కొంటున్నది.
రంగారెడ్డి, జూలై 12 (నమస్తే తెలంగాణ) : ఇండ్లులేని పేద ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంలో భాగంగా త్వరలో జిల్లాలో అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆగస్టులో జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తైన ఇండ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పూర్తైన డబుల్ బెడ్రూం ఇండ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించేందుకు ఇప్పటికే అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయగా, త్వరలో నిధులు విడుదల కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1464 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తై కేటాయించేందుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో జిల్లాలోని 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 60వేల ఇండ్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉండగా, స్థానిక కోటా కింద జిల్లా ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు. జిల్లాలోని అర్భన్ ప్రాంతంలోనే జీహెచ్ఎంసీకి సంబంధించి ఇండ్లను నిర్మించిన దృష్ట్యా ప్రజలకు కేటాయించాలనే నిబంధనల మేరకు జిల్లాలోని అర్హులైన ఇండ్లులేని పేద ప్రజలకు కేటాయించనున్నారు. లబ్ధిదారుల ఎంపికకుగాను వారంలోగా ఇంటింటి పరిశీలన ప్రక్రియను ప్రత్యేక బృందాలు చేపట్టనున్నారు.
లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక టీంలు..
జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తైన మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఫరూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మంచాల, గండిపేట, శంషాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల నుంచి 5223 దరఖాస్తులురాగా ఇప్పటికే 3428 దరఖాస్తులకు సంబంధించి అర్హులుగా రాష్ట్ర సాంకేతిక విభాగం తేల్చింది. టీఎస్టీఎస్ తేల్చిన లబ్ధిదారుల వివరాలతో వారం రోజుల్లో నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఇంటింటికెళ్లి ఎంక్వైరీ చేయనున్నారు. పది మండలాలకు సంబంధించిన లబ్ధిదారుల అర్హుల జాబితాను గృహ నిర్మాణ శాఖ అధికారులు కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ జాబితాను ఆమోదించిన వెంటనే సంబంధిత అర్హుల జాబితాను ఆయా మండలాల తాసిల్దార్లకు పంపనున్నారు. తాసిల్దార్లు, హౌసింగ్ శాఖకు సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఎంక్వైరీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి జాబితాను ప్రదర్శించనున్నారు. గ్రామసభల్లో కూడా లబ్ధిదారుల జాబితాకు ఎలాంటి అభ్యంతరాలు లేనట్లయితే సంబంధిత అర్హుల జాబితాను జిల్లా మంత్రి ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీకి అందజేయనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఎంపిక చేసిన అర్హుల జాబితాకు ఆమోదించిన తర్వాత డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించనున్నారు.
మరోవైపు ఎంక్వైరీలో భాగంగా టీఎస్టీఎస్ తేల్చిన జాబితాలోని లబ్ధిదారులకు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా లేదా, ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారో సంబంధిత ప్రాంతంలో నివసిస్తున్నారా లేదనేది, ఓటర్ ఐడీ కార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నారు. అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లోనూ పూర్తి పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఇండ్లను కేటాయించనున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకు-25, ఎస్టీలకు-25, మైనార్టీలకు-7, ఎక్స్-సర్వీస్మెన్లకు 2, పీహెచ్సీలకు-5, మిగతా 36 శాతం ఇతరులకు రిజర్వేషన్లను కేటాయించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు-17 శాతం, ఎస్టీలకు 6, మైనార్టీలకు 12, ఎక్స్-సర్వీస్మెన్లకు 2, పీహెచ్సీలకు 5, మిగతా 58 శాతం ఇతరులకు రిజర్వేషన్ల ప్రకారం కేటాయించనున్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు 2637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం తుది దశకు చేరుకోగా, 1464 ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. అదేవిధంగా తుదిదశకు చేరిన ఇండ్లకు సంబంధించి షాద్నగర్ నియోజకవర్గంలో 1880 ఇండ్లు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 335, మహేశ్వరం నియోజకవర్గంలో 192, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 130, చేవెళ్ల నియోజకవర్గంలో 100 డబుల్ బెడ్రూం ఇండ్లున్నాయి.