పెద్దఅంబర్పేట, జనవరి 27: అందరి చేతిలో గులాబీ జెండానే మనందరి ఎజెండా కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం బాటసింగారంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన అబ్దుల్లాపూర్మెట్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు చేరాయని తెలిపారు. వివిధ పథకాల లబ్ధిదారులను పార్టీ కార్యకర్తలు తప్పకుండా కలువాలని సూచించారు. వారితో సంక్షేమ పథకాల గురించి చర్చలు పెట్టాలని కోరారు. కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి చేసిన ప్రగతిపై చర్చించాలని కోరారు.
అంకితభావంతో పనిచేయండి
బీఆర్ఎస్ గ్రామశాఖలు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి కోరారు. ప్రభుత్వం గర్భిణులకు కేసీఆర్ కిట్, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, ఇతర పౌష్టికాహారం అందిస్తున్నదని, మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు. వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఇండ్లకు నేరుగా వెళ్లాలని, వారు పొందిన ఫలాలను గుర్తు చేయాలని కోరారు. అప్పుడే ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన పథకాల గురించి ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలపై విజ్ఞప్తులు చేశారని, దీనిపై ప్రభుత్వంతో మాట్లాడేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.15 కోట్ల నిధులతో నాలుగు బ్రిడ్జీల నిర్మాణానికి నడుం బిగించినట్టు చెప్పారు. ఇప్పటికే టెండర్లు సైతం పిలిచినట్టు తెలిపారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికే ఎక్కువ పథకాలు తీసుకొచ్చేందుకు అన్నిరకాలుగా కృషి చేశానని చెప్పారు. ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోటా వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి, రాజారాంచారి, నాయకులు ముద్దం వీరస్వామియాదవ్, ఎర్రవెల్లి గౌరీశంకర్, శ్రీనివాస్రెడ్డి, రాధాకృష్ణ, కంది భాస్కర్రెడ్డి, శ్రీశైలంగౌడ్, వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.