వికారాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. ఓటరు తుది జాబితాతోపాటు ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్(ఎఫ్ఎల్సీ) ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో పూర్తి చేశారు. రెండో దశ ఈవీఎంల పరిశీలన పూర్తి చేసి ఏప్రిల్ 4న ఆయా నియోజకవర్గాలకు ఈవీఎంలను తరలించనున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి రానుండగా, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆయా నియోజకవర్గాలకు సరిపోను ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేశారు.
కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాలతోపాటు పరిగి నియోజకవర్గంలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు ఎన్నికల సిబ్బందిని మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల అధికారులు నియమించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియతోపాటు ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఏప్రిల్ రెండోవారం తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొనే 1257 మంది పీవోలు, 1257 మంది ఏపీవో, 2514 మంది ఓపీవోలకు శిక్షణనిచ్చేలా జిల్లా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
జిల్లాలోని 1133 పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఈవీఎంలను సమకూర్చేందుకుగాను ఈవీఎంలు తక్కువ పడ్డాయి. దీంతో మరో 275 ఈవీఎంలు ఈసీఐఎల్ సంస్థ నుంచి జిల్లాకు తీసుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలో బ్యాలెట్ యూనిట్లు-2267, కంట్రోల్ యూనిట్లు-1694 ఉండగా, వీవీప్యాట్లు-1791 ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికలకు ఓటర్లు పెరిగిన దృష్ట్యా పోలింగ్ కేంద్రాల పెంపునకుగాను తాండూరు నియోజకవర్గంలో 8 కేంద్రాలు, కొడంగల్ నియోజకవర్గంలో 7 పోలింగ్ కేంద్రాలను పెంచేందుకు ఎన్నికల సంఘానికి జిల్లా ఎన్నికల అధికారులు ప్రతిపాదనలను పంపారు. ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇంకా ఓటరుగా నమోదు చేసుకోలేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశమిచ్చింది. ఏప్రిల్ 15 వరకు ఓటరు నమోదుకు గడువు ఇచ్చింది. మీసేవా, ఆన్లైన్ ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం 9,84,068 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 4,86,109 మంది, మహిళలు 4,97,920 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు.
జిల్లాలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో 2,66,273 మంది ఓటర్లుండగా పురుషులు 1,33,625 మంది , మహిళలు 1,32,639 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,31,679 మంది కాగా, ఇందులో పురుషులు 1,15,019 మంది, మహిళలు 1,16,647 మంది, ఇతరులు 13 మంది ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో 2,43,849 మంది ఓటర్లకుగాను పురుషులు 1,18,228 మంది, మహిళలు 1,25,614 మంది, ఇతరులు 7 మంది ఉన్నారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,42,267 మంది కాగా, పురుషులు 1,19,237 మంది, మహిళలు 1,23,020 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయం సాధించేలా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సమావేశమై గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు మంచి పేరున్న కాసాని జ్ఞానేశ్వర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దింపడంతో గెలుపు పక్కా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలోని పరిగి నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం పూర్తికాగా, ఈ నెల 30న తాండూరు, ఏప్రిల్ 3న వికారాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగనున్నది. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యతను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. దీంతో పక్కా వ్యూహంతో సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.