పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఆగస్టులోనే ‘లక్ష్య’ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన చేసి, సబ్జెక్టుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరదీపికలను రూపొందించింది. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసి అర్థమయ్యేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి విద్యార్థి అర్థం చేసుకుని అవగాహనతో రాసేలా ప్రోత్సహిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో వార్షిక పరీక్షలు జరుగనుండడంతో ఈ ఏడాది నవంబర్ 14 నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది ఎస్సెస్సీలో 59.4 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో 176 ఉన్నత పాఠశాలలతో పాటు మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి. ఈ ఏడాది దాదాపుగా 10 వేలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
బొంరాస్పేట, డిసెంబర్ 8 : జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఎస్సెస్సీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఈ ఏడాది ఆగస్టులోనే ‘లక్ష్య’ పేరుతో ఒక కార్యక్రమానికి విద్యాశాఖ రూపకల్పన చేసింది. సబ్జెక్టులవారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక కరదీపికలను రూపొందించి ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభ్యాస దీపికలను అందజేసింది.
విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసి అర్థవంతమైన అభ్యాసాలు చేయించి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. బట్టీ విధానానికి దూరంగా మైండ్ మ్యాపింగ్ ద్వారా విద్యార్థి తన సొంత మాటల్లో రాసేలా స్వీయ రచన చేసేలా ప్రోత్సహిస్తారు. దీంట్లో భాగంగా సగం రోజులు బోధనకు, మిగతా సగం రోజులను పరీక్షల సన్నద్ధతకు కేటాయించారు. వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్ని విధాలుగా సిద్ధం చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు నవంబర్ 14 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు గంటసేపు ప్రతిరోజూ ఒక సబ్జెక్టు చొప్పున విద్యార్థులకు బోధిస్తున్నారు. డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటున్న కారణంగా చలి తీవ్రత తగ్గిన తరువాత ప్రత్యేక తరగతులను సాయంత్రం పూట కూడా నిర్వహించే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 2022-23లో ఎస్సెస్సీలో 59.4 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ విద్యా సంవత్సరం దానిని మరింత పెంచి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారు.
జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ చివరి నాటికి అన్ని సబ్జెక్టుల్లో సిలబస్ను పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చాలా పాఠశాలల్లో 80 శాతం వరకు సిలబస్ పూర్తయినట్లు వారు తెలిపారు. అక్కడక్కడ గణితం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలు మిగిలి ఉన్నాయి. వీటిని కూడా డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరి నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు, మార్చిలో నిర్వహించే వార్షిక పరీక్షలకు విద్యార్థులను అన్ని విధాలుగా సంసిద్ధులు చేయడానికి విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్టుకు ఒక పేపర్తో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ అమలు చేస్తున్న సీఎం అల్పాహారం పథకం, రాగిజావ పథకం పదవ తరగతి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులు పాఠశాలల్లో అందించే అల్పాహారం, రాగిజావ తీసుకుని హాజరవుతున్నారు. గ్రామాల నుంచి ఉదయం పూట ఖాళీ కడుపుతో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో సీఎం అల్పాహార పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే.
పరీక్ష రుసుము చెల్లించాకే
వికారాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు పది వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని 176 ఉన్నత పాఠశాలల్లో 8430 మంది విద్యార్థులుండగా.. మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో మరో రెండు వేల మంది విద్యార్థులుంటారు. వీరిలో వార్షిక పరీక్షలకు పరీక్ష రుసుము ఎంతమంది చెల్లించారో తేలితే వార్షిక పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది.
జిల్లాలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించడానికి కృషి చేస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ‘లక్ష్య’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఏ రోజు ఏ పీరియడ్ చెప్పాలో ఆదేశాలు ఇచ్చాం. నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు కూడా ప్రారంభించాం. డిసెంబర్ చివరి నాటికి అన్ని పాఠశాలల్లో సిలబస్ను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తాం. డిసెంబర్ తరువాత చలి తగ్గితే సాయంత్రం కూడా అరగంట ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నాం. పాఠశాలల్లో అందజేస్తున్న అల్పాహారం, రాగిజావ కూడా పది విద్యార్థులకు ఎంతో ఉపయోకరంగా ఉంటున్నది. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని పదిలో మంచి ఫలితాలు సాధించాలి.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్
కులకచర్ల, డిసెంబర్ 10 : కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని సూర్య బీఎస్సీ-హార్టికల్చర్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించింది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని సూర్య ఆదిలాబాద్ ఉద్యాన పాల్టెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసింది. నవంబర్ 25న జరిగిన బీఎస్సీ-హార్టికల్చర్ ప్రవేశ పరీక్ష రాయగా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఈ పరీక్షలో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకును సూర్య సాధించింది. విద్యార్థిని సూర్యను ఉద్యాన పాల్టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, కుటుంబసభ్యులు, మండల ప్రజలు అభినందించారు.