వికారాబాద్, జనవరి 8 : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 106 ఫిర్యాదులను అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్తో కలిసి కలెక్టర్ స్వీకరించారు.
ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచొద్దని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా తప్పులు దొర్లకుండా వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. టీం లీడర్లు ప్రతి రోజూ రెండు షిఫ్టుల్లో పనిచేయాలన్నారు. ఉదయం, సాయంత్రం పది మంది చొప్పున 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో రోజుకు వెయ్యి దరఖాస్తులను వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు.
నమోదు సమయంలో దరఖాస్తుదారు ఆధార్కార్డు, రేషన్కార్డు, మొబైల్ నంబర్, ఎల్పీజీ గ్యాస్, పట్టాదారు పాసు బుక్కు నంబర్, ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డు నంబర్లు తప్పులు దొర్లకుండా సరిగా నమోదు చేయాలని సూచించారు. డాటా ఎంట్రీ చేసిన దరఖాస్తులను సురక్షితంగా భద్రపరచాలన్నారు. దరఖాస్తుల్లో ఏమైనా అనుమానాలు ఉంటే దరఖాస్తుదారుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ పనులకు సంబంధించి ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యతతో టీం లీడర్ల సహకారంతో పారదర్శకంగా శనివారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులకు ప్రత్యేక నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 11న నిర్వహించే జడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులందరూ నివేదికలతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.