రంగారెడ్డి, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రంగారెడ్డి జిల్లాలో పశుసంపద పెరుగుతున్నది. పశువులకు వ్యాధి నిరోధక టీకాలతోపాటు చికిత్సలు అందిస్తున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చిన్న, సన్నకారు రైతులు, గొర్రెల కాపరులకు తోడ్పాటును ఇస్తూ పశు గణాభివృద్ధిని పెంపొందిస్తున్నది. 2047 నాటికి పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. జిల్లాలో పశువులు 1,88,182 ఉండగా.. గేదెలు, ఆవులు 1,22,587 ఉన్నాయి. అలాగే గొర్రెలు 5,78,254, మేకలు 1,88,190 ఉన్నాయి. పశువులకు గ్రాసం కొరత ఏర్పడకుండా ఉండేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఈ ఏడాదిలో ఇప్ప టివరకు జిల్లాలో 115.7 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేసింది. 2022- 23 పశు సంవర్ధక శాఖ ప్రగతి నివేదిక ప్రకారం 9,23,915 పశువులకు సాధారణ చికిత్స, 15,26,397 పశువులకు రోగ నిరోధక టీకాలను అధికారులు పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి అన్ని రంగాల్లో పురోభివృద్ధిలో కొనసాగుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చిన్న సన్నకారు రైతులు, గొర్రెల కాపరులకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటును ఇస్తూ పశుసంపదను పెంపొందిస్తున్నది. 2047 సంవత్సరం నాటికి పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో రాష్ట్రం, దేశం అగ్రస్థానంలో నిలిచేలా ప్రణాళికలు రూపొందించింది. పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా దేశవ్యాప్తంగా పాడి రైతులు అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. పశు పోషణ ద్వారా గ్రామీణ ఆదాయం చాలా పెరుగుతున్నదని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంటున్నారు. అత్యధిక మంది ఉపాధి పొందుతున్న పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడి రైతులకు జిల్లా అధికార యంత్రాంగం అనేక విధాలుగా చేయూత అందిస్తున్నది.
2014కు ముందు నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం రూ.800 కోట్ల టర్నోవర్కు చేరుకున్నదని అధికారులు చెబుతున్నారు. ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువయ్యేలా నూతన ఔట్లెట్లను పెద్దఎత్తున ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ల పంపిణీతో గొర్రెల సంపద భారీగా పెరిగినట్లు పేర్కొంటున్నారు. పశువులు ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశువులకు ఎప్పటికప్పుడు చికిత్సలు, పశువులకు విత్తులు కొట్టడం, టీకాలు వేయడం, కృత్రిమ గర్భధారణకు తోడ్పటం, పశుగ్రాస పంటల సాగును చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పశువులు 1,88,182 కాగా.. గేదె జాతి పశువులు 1,22,587, గొర్రెలు 5,78,254, మేకలు 1,88,190, కోళ్లు 1,78,09,207 ఉన్నాయి. జిల్లాలో పాత తాలూకాల స్థాయిలో 4 పశు వైద్యశాలలు, పశు వైద్య కేంద్రాలు 46, గ్రామీణ పశు వైద్య కేంద్రాలు 87 ఉన్నాయి.
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు
పశువులు వ్యాధుల బారిన పడొద్దని అందుకు తగిన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎల్ఎస్డీ అనే వ్యాధుల బారిన పడకుండా అన్ని గోజాతి, గేదె జాతి పశువులకు ఈ ఏడాది ఉచితంగా నిరోధక టీకాలను తెలంగాణ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా వేసింది. ఇప్పటివరకు 1,75,265 పశువులకు టీకాలు వేశారు. ఈ టీకాల ద్వారా జిల్లాలో 2,126 మంది రైతులు లబ్ధి పొందారు. జిల్లాలో గొర్రెలు, మేకల్లో నీలి నాలుక వ్యాధి రాకుండా రెండు విడతలుగా 3,18,812 గొర్రెలు, మేకలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. దీంతో జిల్లాలో 2,901 మంది గొర్రె కాపరులు లబ్ధి పొందారు. జిల్లాలోని దాదాపు అన్ని గొర్రెలకు అమ్మతల్లి రోగం నివారణకు టీకాలు వేశారు. వీటి ద్వారా 2,173 మంది గొర్రెల కాపరులు లబ్ధి పొందారు.
పశు పోషణలో ఆడ దూడలకు టీకాలు
జిల్లాలో అధికారులు పశు సంపద వృద్ధికి తోడ్పాటును ఇస్తూ, ఆడ దూడలకు ఏ వ్యాధి సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకుం టున్నారు. పశు పోషకులకు జిల్లాలో అన్ని ఆడ దూడలకు ఉచితంగా బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. గత జనవరి మాసంలో బ్రూసిల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు 28,770 డోసుల వ్యాక్సిన్ టీకాలు ఆడ దూడలకు ఉచితంగా వేశారు.
గొర్రెలు, మేకలకు నట్టల మందు
గొర్రె కాపరుల సహాయార్థం గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు తాగించారు. దీంతో గొర్రెల్లో ఎదుగుదల బాగా ఉండి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నది. ఈ యేడాది ఫిబ్రవరి ఆఖరి వారంలో గొర్రెలు, మేకలకు నట్టల మందులను వేశారు.