షాబాద్, జనవరి 30 : తెలంగాణలోని గొల్ల, కుర్మల సంక్షేమానికి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో అర్హులైన గొల్ల, కుర్మ లబ్ధిదారులందరికీ సబ్సిడీపై గొర్రెలు అందించేందుకు చర్యలు తీసుకున్నది. అందులో భాగంగా రంగారెడ్డిజిల్లాలో గొల్ల, కుర్మలు ఎంతమంది ఉన్నారనే దానిపై సర్వేలు నిర్వహించింది. 2017లో 40వేలకుపైగా అర్హులను గుర్తించింది.
మొదటి విడుతలో 11,372 మందికి గొర్రెల యూనిట్లు అందించింది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున 22 గొర్రెలను పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడుతలో మిగతా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాటు చేస్తుండగా, కరోనా, పలు ఎన్నికల కారణాలతో జాప్యమైంది. దీంతో మిగతావారికి ఇప్పటివరకు గొర్రెల యూనిట్లు అందలేదు.
ఈ పథకం విలువ రూ.లక్షా75వేలు కాగా, లబ్ధిదారులు రూ.43,750 డీడీ రూపంలో చెల్లిస్తే మిగతా రూ.లక్షా 31,250 ప్రభుత్వం సబ్సిడీని కలిపి గొర్రెలను అందించింది. సబ్సిడీ గొర్రెలతో గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. తమను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో బాగుందని, తమకు కూడా అందించాలని ప్రస్తుతం రెండో విడుతలో గొర్రెల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
డీడీలు కట్టిన 790 మంది రైతులు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి),రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో అర్హులైన గొల్ల, కుర్మలందరికీ సబ్సిడీ గొర్రెలు అందించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన వారిలో 50 శాతం మందికి మొదటి విడుతలో, మరో 50 శాతం మందికి రెండో విడుతలో సబ్సిడీ గొర్రెలు అందించే దిశగా చర్యలు చేపట్టింది. మొదటి విడుతలో గొర్రెలు తీసుకున్న లబ్ధిదారులు వాటిని పోషించుకుని జీవనం సాగిస్తున్నారు.
మిగతావారికి రెండో విడుతలో గొర్రెలు అందించేందుకు గతేడాది ఆగస్టులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. జిల్లావ్యాప్తంగా రెండో విడుతలో మొత్తం 30 వేల మందికి గొర్రెలు అందించాల్సి ఉండగా, ఆయా మండలాల పరిధిలో షెడ్యూల్ వారీగా గ్రామాలకు చెందిన రైతుల నుంచి డీడీలు తీసుకున్నది. రెండో విడుతలో తమకు కూడా గొర్రెలు వస్తాయని భావించిన మరో 2,132 మంది లబ్ధిదారులు రూ.43,750 చొప్పున డీడీలు కట్టారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా 1,342 మందికి గొర్రెలను అందించింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మిగతా 790 మందికి గొర్రెలు పంపిణీ చేయలేదు. వీరికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను అందిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా గొర్రెల పథకానికి అర్హులైన 27వేలకు పైగా రైతులు డీడీలు కట్టలేదు. రెండో విడుతలో కట్టిన వారి డబ్బులు తిరిగి ఇస్తారా…? లేక గొర్రెలను అందిస్తారా అనే దానిపై స్పష్టత కరువైంది.
గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి
పేదల సంక్షేమమే ధ్యేయంగా గత పదేండ్ల పాటు అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారు. గొల్ల, కుర్మలకు సబ్సిడీపై గొర్రెలు అందించి వారికి అండగా నిలిచారు. వాటిని పోషించుకుని గొల్ల, కుర్మలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందారు.
గొర్రెలు పంపిణీ చేయాలి
ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీని వెంటనే ప్రారంభించాలి. నాకు రెండో విడుతలో గొర్రెలు అందిస్తామని గత ప్రభుత్వంలో చెప్పారు. అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాలు సంఘం సభ్యులకు అందజేశాం. మా ఊరి పేరు షెడ్యూల్లో రాకపోవడంతో గొర్రెలు ఇవ్వలేదు. ప్రభుత్వం స్పందించాలి.
– మ్యాగూడెం హన్మంతు, లబ్ధిదారుడు కుమ్మరిగూడ(షాబాద్)
అర్హులందరికీ గొర్రెలు అందించాలి
గొల్ల, కుర్మల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడుత పంపిణీకి ఎన్నికల కోడ్ వచ్చింది. గతంలో మాదిరిగా సబ్సిడీ గొర్రెలను అందించాలి.
– కిష్టగోని సదానందం, గొర్రెల కాపరుల సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
ఎలాంటి ఆదేశాలు రాలేదు..
జిల్లాలో మొదటి విడుతలో 11,372 మందికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేశాం. రెండో విడుత పంపిణీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. రెండో విడుతలో 30 వేల మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉన్నది.
– డాక్టర్ అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి