ఉమ్మడి జిల్లాలో రైతుబంధు పంపిణీ సజావుగా కొనసాగుతున్నది. పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఏ చింత లేకుండా సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. గురువారం మూడెకరాల లోపు భూమి ఉన్న రైతులకు సాయం అందించారు. రంగారెడ్డి జిల్లాలో 2,43,825 మంది రైతుల ఖాతాల్లో రూ.144.90 కోట్లు జమకాగా, వికారాబాద్ జిల్లాలో 45,146 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.55కోట్లు జమయ్యాయి.
రంగారెడ్డి, జూన్ 28(నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్కు ముందే సాయం అందుతోంది. నాగలి సంతోషంతో గంతులేస్తున్నది. వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అన్నదాతలకు భరోసాగా నిలుస్తున్నది. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే రోజులు పోయి రైతులు తలెత్తుకునే రోజులు నేడు కన్పిస్తున్నాయి. ఇవన్నీ.. ఒక్క రైతు బంధుతోనే ఆవిష్కృతం అవుతున్నాయి. దుక్కులు చేసే సమయం నుంచి పంటను విక్రయించే వరకు రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి కొండంత భరోసాను కల్పిస్తున్నాయి. గడిచిన పదేళ్లకాలంలోనే పంటల సాగు విస్తీర్ణం 4,04,081 ఎకరాలకు పెరగగా..గడచిన పది విడతల్లో జిల్లాలోని రైతులకు రూ.3,017.91కోట్ల పెట్టుబడి సాయం అందింది.
తీరిన అప్పుల తిప్పలు
ఎన్నో ఆశలతో సాగుకు ఉపక్రమించే రైతులకు ప్రతి సీజన్లోనూ పెట్టుబడి పెద్ద సమస్యగా ఉంటున్నది. అప్పులు చేసి పంటలను సాగు చేసినప్పటికీ పెట్టిన పెట్టుబడులు సైతం ఎల్లక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో కోకొల్లలు. అయితే రైతులు అప్పులకు దూరంగా ప్రశాంతంగా పంటలను సాగు చేసుకునేలా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సీజన్లోనూ పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ పంటలను పండించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో బ్యాంకులు సైతం రుణాలను అందిస్తున్నాయి. రుణమాఫీ వంటి పథకాలు సైతం రైతులకు ఊరటనిచ్చాయి. పంటల సాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందడమే కాకుండా.. సకాలంలో చెల్లింపులు జరిపి ఆర్థిక ప్రగతి సాదిస్తున్నారు.
సాగులోకి పడావు భూములు
ఒకప్పుడు కరువుకు మారుపేరుగా నిలిచిన జిల్లాలోని పల్లెలు నేడు పాడి పంటలతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయతో అందుబాటులోకి వచ్చిన నీటివనరులతో పడావు పడ్డ భూములు సైతం సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 50వేల ఎకరాల్లోనే పంటలు సాగవుతుండగా.. 2022-23 వానకాలం నాటికి సాగు విస్తీర్ణం 4.04లక్షల ఎకరాలకు పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే సాగు విస్తీర్ణం ఊహించని రీతిలో పెరగనుంది. సాగు నీరు, ఉచిత విద్యుత్తో వలసవెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. సకాలంలో పెట్టుబడి సాయం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులను సమృద్ధిగా అందుబాటులోకి ఉంచడం వంటి చర్యల ఫలితంగా ఒకప్పుడు ఎకరంలోనే సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.
2013-14 వానకాలం సాగు విస్తీర్ణం 50 వేల ఎకరాలు
2022-23 నాటికి పెరిగిన విస్తీర్ణం 4,04,081 ఎకరాలు
2018 వానకాలంలో రైతుబంధు లబ్ధిదారులు2,47,694
2022-23 నాటికి లబ్ధిపొందిన రైతులు 3,94,066 మంది
2018లో అందిన పెట్టుబడి సాయం రూ.255.29కోట్లు
2022-23 నాటికి పెరిగిన సాయం రూ.378.95కోట్లు
రైతుబంధుతో ఆత్మైస్థెర్యం పెరిగింది
సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు పథకంతో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది. గత ప్రభుత్వాలు కనీసం ఎరువులను కూడా అందుబాటులో ఉంచేదికాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిసాయంతో పాటు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. రైతుబంధు డబ్బులు జమ కావడంతో బయట అప్పులు చేయడం మానేశాం.
– నారాయణ, కుత్బుల్లాపూర్, పూడూరు
డబ్బులు పడ్డాయ్
రైతు బంధు పెట్టుబడి సాయం డబ్బులు నా ఖాతాలో జమ అయ్యాయి. మొత్తం రూ.5,250 పడినయ్. చాలా సంతోషంగా.. భరోసాగా ఉన్నది. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నడు. గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాలకు చాలా ఇబ్బందులు పడ్డాం. రైతులను అసలే పట్టించుకునేవాళ్లు కాదు.
– తిరుమలకుమార్, జాలగూడెం, చేవెళ్ల
పెట్టుబడి సాయం రైతుకు భరోసా
తెలంగాణ ప్రభుత్వం రైతులకు పంట సాగు కోసం పెట్టుబడి అందిస్తూ భరోసాగా నిలుస్తున్నది. గతంలో నాట్ల సమయం వచ్చిందంటే కూలీలకు, దున్నకం ఖర్చులకు అప్పు చేయాల్సి వచ్చేది. షావుకారి దగ్గర వడ్డీకి తెచ్చి చానా ఇబ్బందులు పడ్డాం. బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు డబ్బులను వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందే అందించడంతో రైతులకు పెట్టబడి తిప్పలు తప్పాయి.
– రాములు, చిన్ననందిగామ, కొడంగల్