షాబాద్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఇప్పటివరకు 4,85,841 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 71,213 మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, 20,382 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు. వైద్య సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమున్నవారికి కండ్లద్దాలతోపాటు, మం దులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శని, ఆదివారాలతోపాటు, సెలవు దినాల్లో మినహాయించి మిగతా రోజుల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు చేయించుకున్నవారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా కంటి సమస్యలతో బాధపడుతూ.. ప్రైవేట్ దవాఖానలకు తిరిగినా నయం కాలేదని, సర్కారు తమ గ్రామాల్లోనే క్యాంపులను ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. అందరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యసిబ్బంది సూచిస్తున్నారు.
పేదలకు ఎంతో ఉపయోగం ;- తెరువటి జంగయ్య, హైతాబాద్
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కంటి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గొప్ప పరిణామం. దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కండ్లద్దాలు పంపిణీ చేయడం సంతోషకరం. డబ్బులు లేని పేదవాళ్లకు కంటి వెలుగు ఓ వరంగా మారింది. ఎన్నో ఏండ్లుగా కంటి సమస్యలతో బాధపడుతున్నా. ప్రైవేట్ దవాఖానలకు తిరిగినా నయం కాలేదు. సర్కారు గ్రామాల్లోనే క్యాంపులను ఏర్పాటు చేసి పరీక్షలు చేయడం సంతోషంగా ఉంది.
కేసీఆర్ పేదల పక్షపాతి ;- గూడూరు సుధాకర్రెడ్డి, బీఆర్ఎస్నాయకుడు, బోడంపహాడ్(షాబాద్)
తెలంగాణలో పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఏండ్ల తరబడిగా కంటి సమస్యలతో బాధపడేవారికి కంటి వెలుగు పథకం ద్వారా పరీక్షలు చేయడం గొప్ప నిర్ణయం. మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం, రెండో విడుత కూడా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. కంటి వెలుగు కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.