రంగారెడ్డి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : మత్స్యకార్మికుల జీవితాల్లో గత ప్రభుత్వాలు మత్స్యకారులను విస్మరించడంతో వృత్తిని వదిలి ఏదో ఒక పని చేస్తూ కాలం వెళ్లదీసే దుస్థితి ఉండేది. కానీ.. రాష్ట్రం సిద్ధించాక మత్స్యకారుల బతుకులు మారాయి. సర్కారు చేయూతతో వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండాయి. ‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఏడాదంతా నీరు నిల్వ ఉండడం, నీలి విప్లవం పేరుతో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేయడం వారికి వరంగా మారింది. వలలు, ద్విచక్ర వాహనాలు, టీవీఎస్ చాంప్ మోపెడ్లు, ఆటోలు, బొలెరో వాహనాలనూ అందించి మత్స్యకారుల బతుకులకు భరోసానిచ్చింది. నిరంతరం ఉపాధి లభిస్తుండడంతో మత్స్యకారుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. రంగారెడ్డి జిల్లాలో మత్స్య సిరులు కురుస్తున్నాయి. నీలి విప్లవం పేరుతో తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారంతో అద్భుత ఫలితాలు వచ్చాయి. గడిచిన ఏడేండ్లలో రూ.5.60కోట్ల నిధులతో 8.59కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. దీంతో 41,753 మెట్రిక్ టన్నుల చేపలు ఉత్పత్తి కాగా, మత్స్యకారుల పంట పండింది. ఫలితంగా ఏడేండ్లలోనే మత్స్యకారుల కుటుంబాలకు రూ.565.98 కోట్ల సంపద చేకూరింది.
రంగారెడ్డి జిల్లాలోని చెరువులన్నీ ఎండా, వాన కాలంలోనూ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇప్పటివరకు రూ.5.60కోట్ల నిధులతో 8.59కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా 41,753 మె.ట చేపలు ఉత్పత్తి అయ్యాయి. ఫలితంగా..కేవలం ఏడేండ్లలోనే ఈ పథకం అక్షరాలా రూ.565.98కోట్ల సంపదను సృష్టించింది. సబ్సిడీ వాహనాలు, వలలు, బోట్లు అందించడంతోపాటు బీమా సౌకర్యం కల్పించి సీఎం కేసీఆర్ మత్స్యకార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.
జిల్లాలో ఏటా 10వేల టన్నుల చేపల ఉత్పత్తి
జిల్లాలోని 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 మత్స్యశాఖకు సంబంధించిన చెరువుల్లో చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదిలి చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. 2016లో 10లక్షల చేపపిల్లలతో మొదలైన పంపిణీ కార్యక్రమం 2022 సంవత్సరం నాటికి 1.63కోట్ల చేప పిల్లల పంపిణీ స్థాయికి చేరింది. ఈ పథకం ప్రారంభంలో కేవలం 5,510 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ప్రస్తుతం చేపల ఉత్పత్తి 10వేల టన్నులకు పెరిగింది. మత్స్య సంపదను పెంచే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకార్మిక కుటుంబాలను ఇతోధికంగా ఆదుకుంటున్నది. జిల్లాలో ఉన్న 161 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 8,221 మందికి వివిధ రూపాల్లో ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నది. చేపలను ఉచితంగా అందజేయడంతోపాటు చేపల వేట సందర్భంగా దురదృష్టవశాత్తు మరణిస్తే బీమాతో ఆదుకుంటున్నది.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఏ కుంట, చెరువును చూసినా.. చేపల చెరువే గుర్తుకొస్తుంది. రంగారెడ్డి జిల్లాలో పల్లె లేదు.. పట్టణం లేదు. ఎక్కడ చూసినా చేపలే చేపలు. దీంతో చేపలకు కొరత అనేదే లేకుండా పోయింది. రవ్వ, బొచ్చె రకాలతోపాటు ప్రయోగాత్మకంగా కొన్ని చెరువుల్లో రొయ్యలను సైతం ప్రభుత్వం పెంచుతున్నది. గతంలో మాదిరిగా చేపల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పెరిగిన మత్స్య సంపదతో జిల్లా ఫిష్ హబ్గా మారిపోగా.. పెరిగిన సంపద మత్స్యకార్మిక కుటుంబాలకు సైతం భరోసా ఇస్తున్నది.
ఏడాది పొడవునా ఉపాధి
జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మత్స్య ఉత్పత్తి సైతం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో మత్స్యకార్మిక కుటుంబాలు ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నాయి. చేపల వేట ద్వారానే రూ.కోట్లకు పైగా ఆదాయాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఒక్కో సభ్యుడికి సీజన్లో సగటున రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షలకు పైగానే లబ్ధి కలుగుతున్నది. ఈ ఏడాది కూడా 1.96కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం చెరువుల్లో వదలగా.. ప్రతి సభ్యుడు అదే స్థాయిలో ఆదాయం పొందేలా చేయూత కల్పించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి చెందిన చేపలు ఇతర రాష్ర్టాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. దీంతో చేపలను విక్రయించుకునేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే దిశగానూ మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. చేపల విక్రయానికి సంబంధించిన స్టాల్స్ను సమకూర్చడంతోపాటు చేపల వంటకాలపై మత్స్య కార్మిక కుటుంబాల్లోని మహిళలకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తున్నది.
మత్స్యకారుల్లో వెల్లివిరుస్తున్న సంతోషం
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తున్నది. చేపపిల్లలను పట్టుకునేందుకు వలలను, రవాణా కోసం ద్విచక్ర వాహనాలను, టీవీఎస్ చాంప్ మోపెడ్లను, లగేజీ ఆటోలను, బొలేరో వాహనాలను అందజేస్తున్నది. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలను నిర్వహించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నది.
జీవనోపాధి పొందుతున్నాం
మత్స్య సహకార సంఘాలకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసే పథకం ఎంతో బాగుంది. చేప పిల్లల పెంపకంపై ఆధారపడిన మత్స్యకారులకు ఇది ఆర్థికంగా తోడ్పాటును ఇస్తున్నది. నయాపైసా ఖర్చు లేకుండా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల చేప పిల్లల కొనుగోలుకు మత్స్యకారులపై ఆర్థిక భారం లేకుండా పోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఉచిత చేప పిల్లలను జాగ్రత్తగా పెంచుకుంటూ పెద్దయిన తరువాత వాటిని అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాం. ఉచితంగా చేప పిల్లలతో పాటు వాటిని పట్టడానికి వలలు, అమ్ముకోవడానికి ప్రభుత్వం వాహనాలను అందజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయి. చేప పిల్లలను మత్స్యకారులే డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చేది. కేసీఆర్ సీఎం అయిన తరువాత మత్స్యకారుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మత్స్యకారులు సంతోషంగా జీవిస్తున్నారు.
– లక్ష్మీనారాయణ, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు, దుప్చెర్ల, బొంరాస్పేట
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం చేసిన సంక్షేమంతో వారి కుటుంబాల్లో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. గత కాంగ్రెస్, టీడీపీ సర్కారు పాలనలో మత్స్యకారులకు ఉపాధి లేక ఇతరు పనులు చేసుకొని కుటుంబాలను పోషించుకునేవాళ్లం. స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ మత్స్యకారులకు ఎంతో మేలు చేశారు. ముఖ్యంగా చెరువు, కుంటల్లో పుష్కలంగా నీరు ఉండటంతో మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతున్నది. ప్రభుత్వం చేపపిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులకు వరంగా మారింది. పెరిగిన చేపపిల్లలను తిరిగి విక్రయించడంతో మంచి లాభాలు పొంది స్వయం ఉపాధి పొందుతున్నాం. మత్స్యకారుల సంక్షేమానికి ఎవరూ చేయలేని కృషిని సీఎం కేసీఆర్ చేశారు.
– సంగెం రాజు, నానక్నగర్, యాచారం
మత్స్యకారుల సంపద పెరిగింది
మత్స్యకారుల సంపద పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. మత్స్యకారుల కోసం ప్రాజెక్టులు, చెరువుల్లో చేపలను పెంచేందుకు చేపపిల్లలను పంపిణీ చేశారు. వారికి చేపలను అమ్ముకోవడానికి ద్విచక్రవాహనాలతోపాటు నాలుగు చక్రాల వాహనాలు కూడా సమకూర్చారు. తాండూరు మండలంలోని జినుగుర్తి శ్రీరాములవారి ప్రాజెక్టులో చేపల పెంపకాన్ని చేపట్టాం. దీంతో మత్స్యకారుల సంపద పెరిగింది. మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం.
– శివరామ్, మత్స్యకారుల సహకార సంఘం, ప్రధాన కార్యదర్శి, జినుగుర్తి, తాండూరు
మత్స్యకారులను గుర్తించింది సీఎం కేసీఆరే..
గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోని మత్స్యకారులను సీఎం కేసీఆర్ గుర్తించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి అనేక పథకాలను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణి చేయడంతో స్వయం ఉపాధి దొరికింది. చేపలను దిగుమతి చేసుకోకుండా ప్రతి గ్రామంలో ప్రతి చెరువులో చేపలను పెంచి తాజా చేపలను ఎగుమతి చేసే స్థాయికి మత్స్యకారులు ఎదగడం ఎంతో సంతోషకరం. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేపల వలలు, ద్విచక్రవాహనాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయడంతో మత్స్యకారులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉన్నారు.
– నూకం మహేందర్, నందివనపర్తి, యాచారం మండలం
మత్స్యకారులకు సీఎం కేసీఆర్ అండగా..
మోమిన్పేట మండలం ఎన్కతల పెద్ద చెరువులో చాలా సంవత్సరాల నుంచి చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాం. సరైన సౌకర్యాలు లేక అనే ఇబ్బందులకు గురయ్యాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం మత్స్యకారుల కోసం చెరువులో చేపపిల్లలను వదలడం చాలా సంతోషంగా ఉంది. చేపలను పట్టుకునేందుకు, అమ్మేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. చేపలను హైదరాబాద్లో అమ్ముకుంటున్నాం. ప్రభుత్వం మత్స్య శాఖ తరఫున నాకు ఒక ద్విచక్ర వాహనాన్ని అందించింది. మత్స్యకారుల కోసం కేసీఆర్ కృషి చేయడం చాలా సంతోషంగా ఉంది.
– మెట్టు రాములు, మత్స్య సంఘం ఎన్కతల గ్రామ అధ్యక్షుడు, మోమిన్పేట
మత్స్యకారుల జీవనోపాధి పెరిగింది
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండంతో మత్స్యకారులకు జీవనోపాధి లభించింది. గత ప్రభుత్వాలు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేసేవి కాదు. ఇలాంటి పోత్సాహకాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ లాంటివారు రాష్ర్టానికి చాలా అవసరం. కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– అనంతయ్య, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, ముజాహిద్పూర్, కులకచర్ల