వికారాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పీ చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు జడ్పీ పీఠాన్ని దక్కించుకునేలా పట్టు బిగిస్తున్నారు. ఇప్పటికే నిర్ణీత సమయంలోగా బలపరీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన బీఆర్ఎస్ జడ్పీటీసీలు అవిశ్వాసం ప్రవేశపెడితే నెగ్గేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు బీఆర్ఎస్ జడ్పీటీసీలు అందరూ దూరంగా ఉండి ఐక్యతను చూపించారు. జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కేవలం నలుగురు సభ్యులు మాత్రమే హాజరుకావడంతో నామమాత్రంగా అర్ధగంటలో సమావేశాన్ని ముగించి జడ్పీ చైర్పర్సన్ వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఈ సమావేశాలకు హాజరుకావాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలకు స్వయంగా జడ్పీ చైర్పర్సన్ ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో తూతూ మంత్రంగా రెండు కమిటీ సమావేశాలను నిర్వహించారు. జడ్పీ స్టాండింగ్ సమావేశాలకు సంబంధించి వ్యవసాయంతోపాటు గ్రామీణాభివృద్ధి, ఆర్థిక-ప్రణాళిక, వైద్యారోగ్యం-విద్య, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమం, పనులకు సంబంధించిన ఏడు స్టాండింగ్ కమిటీలు ఉంటాయి.
సోమవారం నిర్వహించిన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు జడ్పీ చైర్పర్సన్(కోట్పల్లి జడ్పీటీసీ)తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దేముల్, బంట్వారం జడ్పీటీసీలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరిన బషీరాబాద్ జడ్పీటీసీ సమావేశానికి హాజరయ్యారు.
మిగతా 14 మంది బీఆర్ఎస్ జడ్పీటీసీలు ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు దూరంగా ఉన్నారు. ప్రతి స్టాండింగ్ కమిటీలోనూ ఇద్దరు సభ్యుల కోరం ఉంటేనే సమావేశం నిర్వహించేందుకు వీలుంటుంది. కేవలం నలుగురు సభ్యులు మాత్రమే ఉండడంతో పనుల కమిటీతోపాటు సాంఘిక సంక్షేమ కమిటీలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించి ముగించారు.