Congress | నేతల ఆందోళనలతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ అట్టుడుకుతున్నది. ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా నుంచి మొదలైన అసమ్మతి సెగలు నేటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం మల్ రెడ్డి రంగారెడ్డి టికెట్ కేటాయించడంతో అసమ్మతి నేతల్లో ఒకరైన దండెం రాంరెడ్డి రెండు రోజుల క్రితం గాంధీ భవన్ వద్ద తన అనుచరులతో కలిసి తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించారు.
ఇదే క్రమంలో శుక్రవారం తుర్కయాంజాల్లో మల్రెడ్డి రంగారెడ్డి నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు అసమ్మతి నేతలు దండెం రాంరెడ్డి, మర్రి నీరంజన్రెడ్డి గైర్హాజరవ్వడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఎన్నికల వేళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీరు ‘ఎవరికీవారే.. యుమునాతీరే’ అన్న చందంగా మారింది. ఒకవైపు ఆందోళనలు.. మరోవైపు ప్రచారానికి సహకారం లేకపోవడంతో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. పార్టీ క్యాడర్ సైతం అయోమయానికి గురవుతున్నది.
రంగారెడ్డి, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): ‘రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్లో అసమ్మతి రాగం సెగలు రేపుతున్నది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా నుంచి మొదలైన అసమ్మతి మంటలు నేటికీ చల్లారడం లేదు. ఎంతోకాలంగా ఇక్కడి కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న ముసలం.. టికెట్ కేటాయింపు తర్వాత మరింత రగడలా మారింది. కాంగ్రెస్ అధిష్టానం మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అసమ్మతికి మరింత ఆజ్యం పోసిందన్న విమర్శలు పార్టీ క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి.
అసమ్మతి నేతల్లో ఒకరైన దండెం రాంరెడ్డి రెండు రోజుల క్రితం గాంధీభవన్ వద్ద తన అనుచరులతో కలిసి తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించారు. ఇదే క్రమంలో శుక్రవారం తుర్కయాంజాల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి సైతం దండెం రాంరెడ్డి గైర్హాజరయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోపాటు మరో అసమ్మతి నేత మర్రి నిరంజన్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరుకాకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది.’
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో టికెట్ చిచ్చు రగులుతూనే ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అసమ్మతి మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మొదటి నుంచీ నియోజకర్గంలో టికెట్ విషయంలో తీవ్ర పోటీ నెలకొన్నది. ఏడుగురు దరఖాస్తు చేసుకోగా.., ప్రధానంగా ఇద్దరు ముగ్గురు నేతల మధ్యనే పోటీ సాగింది. మల్రెడ్డి రంగారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. దండెం రాంరెడ్డి ఉత్తమ్కుమార్రెడ్డితో, మర్రి నిరంజన్రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో టచ్లో ఉన్నారు. ఈ ముగ్గురూ ఎవరికివారుగా తమ నేతలతో టికెట్ కోసం ప్రయత్నాలు చేయగా.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపింది.
తనకే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న దండెం రాంరెడ్డి, మర్రి నిరంజన్రెడ్డిలకు అధిష్టానం నిర్ణయం కంగుతినేలా చేసింది. మర్రి నిరంజన్రెడ్డి మౌనంగానే ఉంటున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. దండెం రాంరెడ్డి గతంలోనే తన అనుచరులతో సమాలోచనలు జరిపి టికెట్ విషయంలో పునరాలోచించాలని అధిష్టానానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. ఆ తర్వాత గాంధీ భవన్ వద్ద దండెం రాంరెడ్డి తన వర్గీయులతో కలిసి ఆందోళన చేపట్టారు. రేవంత్రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది జరిగిన మరుసటి రోజే శుక్రవారం మల్రెడ్డి రంగారెడ్డి తుర్కయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్గౌడ్, లక్ష్మీపతిగౌడ్, మల్రెడ్డి రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి అసమ్మతి నేతలు దండెం రాంరెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డిలు హాజరు కాలేదు. స్థానిక ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం డుమ్మాకొట్టడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. తన అనుచరుడికి టికెట్ దక్కకపోవడం వల్లనే ఆయన డుమ్మా కొట్టారన్న ప్రచారం జరుగుతున్నది.
మొదటినుంచీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ వర్గపోరుకు కేరాఫ్గా ఉంటూ వస్తున్నది. ఇక ఎన్నికల వేళలోనూ..సద్దుమణగక నేటికీ ఆ పార్టీ గ్రూపుల గొడవలతో సతమతమవుతున్నది. ఈ వ్యవహారం కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి తలనొప్పిగా మారింది. గతంలో మలక్పేట్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తరఫున రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఒకసారి మహేశ్వరం నుంచి కూడా పోటీచేసి ఓటమి పాలయ్యారు.
మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇబ్రహీంపట్నం నుంచి ఎన్నికల బరిలో నిలిస్తే.. అసమ్మతి నేతలెవరూ కలిసిరాకపోవడం ఆయనను అంతర్మథనంలో పడవేస్తున్నది. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం మల్రెడ్డికి పెద్ద సవాల్గా మారింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదయ్యాక కూడా ప్రచారం మొదలుపెట్టలేని పరిస్థితి నెలకొంది. అసమ్మతి నేతలను కలుపుకు పోతారా? లేక.. పోతే పోనీలే అన్నట్లుగా వ్యవహరిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తన శ్రేణులతో కలిసి ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ను సైతం అయోమయానికి గురిచేస్తున్నాయి.