ధరణి పోర్టల్ అన్నదాతలకు వరం.. ఆన్లైన్ కావడంతో ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కాగా భూ రికార్డుల నిర్వహణ జరుగుతున్నది.. రికార్డుల్లో పేరు తప్పుగా రావడం.. ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం.. భూ విస్తీర్ణంలో తేడాల వంటి ఎన్నో సమస్యలకు ‘ధరణి’తో పరిష్కారం లభిస్తుండడంతో వ్యవసాయ భూములకు భద్రత ఏర్పడింది. ‘ధరణి’తో చకచకా పనులు పూర్తవుతుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణి పోర్టల్తో భూ సమస్యలు సమసిపోతున్నాయి. అన్నదాతలు గతంలో మాదిరిగా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.. అదనపు ఖర్చు లేదు.. పలుమార్లు తిరగాల్సిన పని లేకుండా పారదర్శకంగా సేవలందుతున్నాయి. అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా పోయింది. కలెక్టర్ మొదలుకొని ఆయా మండలాల తహసీల్దార్ల వరకు తమ లాగిన్కు వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తున్నారు. మ్యుటేషన్స్, సక్సెషన్స్, ఆధార్ సీడింగ్, జీపీఏ, ఆర్గనైజేషన్ పీపీబీ, ప్రొహిబిటెడ్ జాబితా, పీపీబీ లేకుండా సక్సెషన్, కోర్టు కేసుల ద్వారా పీపీబీ తదితర దరఖాస్తులకు వెంటనే విముక్తి లభిస్తున్నది. మీ సేవలో స్లాట్ బుక్ చేసిన తేదీలో రిజిస్ట్రేషన్తో పాటు డాక్యుమెంట్ అన్నదాతలకు అందుతున్నది. రంగారెడ్డి జిల్లాలో గతేడాది డిసెంబర్ వరకు వివిధ రకాల 1,89,068 భూ సమస్యలకు ‘ధరణి’తో పరిష్కారం లభించింది. త్వరలోనే భూ సమస్యలు లేని రంగారెడ్డి జిల్లాను చూస్తామని కలెక్టర్ ఎస్.హరీశ్ పేర్కొనడం గమనార్హం.
రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగా మ్యుటేషన్లు శరవేగంగా పరిష్కారం అవుతున్నాయి. అయితే, ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో భూ దందాలు అనేకం జరిగి ఎంతో మంది భూ పట్టాదారులు లెక్కలేనన్ని సమస్యల్లో ఇరుక్కుపోయారు. భూ సమస్యలతో తిప్పలు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ పరిష్కారం చూపుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని విధంగా భూ సమస్యలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ‘ధరణి’ పోర్టల్తో చెక్ పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ విజయవంతంగా కొనసాగుతున్నది. భూ సమస్య ఎంత జఠిలమైనదైనా పరిష్కరిస్తున్నది. జిల్లాలో భూ సమస్యలు అనేకం ఉన్నప్పటికీ 97 నుంచి 98 శాతం వరకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించింది. త్వరలోనే భూ సమస్యలు లేని ‘రంగారెడ్డి’ని చూడొచ్చని జిల్లా కలెక్టర్ హరీశ్ చెబుతున్నారు. ధరణిలో సమస్యలు వేగవంతంగా, సులభతరంగా, పారదర్శకంగా లావాదేవీలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ధరణిపై అవగాహన పెంచుకొని వారి సమస్యల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ వరకు వివిధ రకాల 1,89,068 భూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటికీ ‘ధరణి’ వేదికగా పరిష్కారం చూపింది. కాగా, జిల్లాలో పలు రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ‘ధరణి’ పోర్టల్ చెక్ పెడుతున్నది.
ధరణి లేకుంటే.. దారుణమే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ముందడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. రైతుల కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడిన విజ్ఞానమిది. నిరుపేద రైతుల భూములకు రక్షణ కల్పించే ధరణి లేకుంటే.. బడుగులు, బలహీనుల భూములను తన్నుకుపోయే దుర్మార్గపు రోజులివి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సంరక్షణ చర్యల్లో భాగంగా ‘ధరణి’ అనే వేదికను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో పేరుకుపోయిన భూ సమస్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ, ‘ధరణే.. మా ధైర్యం” అని నిరుపేద రైతులు గొంతెత్తి చెప్పుకునేలా నేడు ‘ధరణి’ సాహసోపేతమైన పరిష్కార చర్యలను చేపడుతున్నది. జిల్లాలోని ఒక్కొక్క మండల రెవెన్యూ కార్యాలయం ముందు రైతులు పలు భూ సమస్యలతో వందలు, వేలాదిగా బారులు తీరుతున్నారు. ఎలాంటి భూ సమస్యలకైనా ధరణి ఇట్లే పరిష్కారం చూపడంతో రైతులు తెలంగాణ ప్రభుత్వం పని తీరును, ధరణి పోర్టల్ను వేనోళ్ల కొనియాడుతున్నారు. ధరణి లేకుంటే దళారులు తమ నోట్లో మట్టి కొట్టేవారని పలువురు లబ్ధిదారులు అభిప్రాయం చెబుతున్నారు.
పైసా ఖర్చు లేకుండా..
భూముల సమస్యల పరిష్కారానికి సర్కార్ తెచ్చిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇంతకుముందు పాసు బుక్కులో తప్పు ఒప్పులు సరిచేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోతే పైసలు ఇచ్చిందాకా పనులు చేసేటోళ్లు కాదు. పైసలు తీసుకున్నా కూడా రోజుల తరబడి ఆఫీస్ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడ్డాం. రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ ధరణి తెచ్చి ఎవరికి రూపాయి ఇచ్చే పనిలేకుండా అంతా ఆన్లైన్తో పని చేయించడం మంచి నిర్ణయం.
– పి. పర్వతాలు, కుమ్మరిగూడ(షాబాద్)
ధరణి వచ్చాకే త్వరగా రిజిస్ట్రేషన్లు
తెలంగాణ సర్కార్ భూ ప్రక్షాళనలో భాగంగా ధరణి పోర్టల్ తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ల సమస్యలు తీరాయి. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుండడంతో ఎంతో సమయం ఆదా అవుతుంది. సామాన్య రైతులకు అర్థమయ్యేలా ధరణిని రూపొందించడం బాగుంది. గతంలో రిజిస్ట్రేషన్ అంటే రోజంతా గడిచిపోయ్యేది. ప్రస్తుతం కొద్ది సమయంలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
-వహబ్, రైతు, విఠ్యాల, షాద్నగర్
మోసాలను అరికట్టొచ్చు..
ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దళారులు ఇష్టారీతిలో అమయాకులైన రైతులను చేస్తున్న మోసాలను అరికట్టేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. దీంతో రైతుల భూమికి భద్రత ఏర్పడింది. గతంలో ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉంటదో అనే భయం ఉండేది, కానీ ప్రస్తుతం ధరణి వల్ల రైతులకు భయం లేదు.
-ఇంద్రసేనారెడ్డి, శేరిగూడ , శంకర్పల్లి మండలం
నాణ్యమైన సేవలు
భూ రిజిస్ట్రేషన్ల కోసం తాసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. ధరణి నిబంధనలను పూర్తి చేసుకుని కార్యాలయానికి వచ్చే రైతులకు నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా సేవలు అందిస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తున్నాం. ప్రతి రోజూ సుమారు 20నుంచి 30రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ధరణిలో ఎలాంటి సందేహాలు ఉన్నా వారికి అర్థమయ్యేలా వివరిస్తున్నాం.
-గోపాల్, తహసీల్దార్, ఫరూఖ్నగర్
భూముల రిజిస్ట్రేషన్ సులువు
ధరణి పోర్టల్తో భూముల రిజిస్ట్రేషన్ సులువైంది. గతంలో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి అనేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేవు. సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకున్న మరుసటి రోజే క్రయ, విక్రయదారులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వేలి ముద్రలు వేయగానే విక్రయించిన వ్యక్తి నుంచి భూమి తొలగించబడి కొనుగోలు చేసిన వ్యక్తి పేరులోకి మారుతున్నది. పని చాలా సువులుగా అవుతున్నది.
– ఎం.రామస్వామి, అంతారం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
రైతులకు సత్వర సేవలు..
ధరణి పోర్టల్తో రైతన్నలకు సత్వర సేవలు అందుతున్నాయి. గతంలో రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది. ధరణి సేవలతో ఇదివరకు లాగా దళారీ వ్యవస్థకు తావివ్వకుండా ఫుల్స్టాప్ పడింది. దీంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల్లోనే పట్టా పాస్ పుస్తకం ఇంటికే వస్తున్నది. ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టి రైతుల సమస్యలు తీర్చుతున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
– ఎం.రవీందర్, తల్లారం గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
పనులు త్వరగా అవుతున్నాయి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో పనులు త్వరగా పూర్తి అవుతున్నాయి. గతంలో భూముల సమస్యలపై నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్యలు తీరలేదు. రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాసేటోళ్లు. కానీ రైతుల సమస్యలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయాల్లోనే పనులన్నీ నిమిషాల వ్యవధిలో పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టడం సంతోషకరం.
– కావలి శివరాజ్, హైతాబాద్(షాబాద్)
ధరణితో రైతులకు మేలు
ధరణి పోర్టల్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. భూ పట్టామార్పిడి నిమిషాల్లో అవుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే ఎంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు డబ్బులతో పాటు సమయం కూడా కలిసి వస్తున్నది. ఇదివరకు సంవత్సరం పాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా పనికాక పోయేది. తెలంగాణ ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టాక రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్లు, డాక్యుమెంట్, పాసు పుస్తకాలు అందజేస్తున్నారు.
– వీరేశ లింగం, దేవరంపల్లి గ్రామ రైతు
సమస్యలు దూరం..
గతంలో రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు ధరణి రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే 10 లేదా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి పూర్తికావడంతో పాటు అదే రోజు నేరుగా డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు అందజేయడం ఎంతో సంతోషంగా ఉంది.
– శ్రావణ్కుమార్గౌడ్, చేవెళ్ల
రికార్డులు భద్రం..
ధరణి పోర్టల్ పెట్టడం వల్ల రికార్డులు భద్రంగా ఉంటాయి. గతంలో బుక్లో రికార్డులు రాయడం వలన వీఆర్వోలు డబ్బులకు ఆశపడి రికార్డులు మార్చే వారు. రైతు పొలం మీద సాగు చేసుకుంటూ ఉండే వాడు. కానీ రికార్డుల్లో మాత్రం పేర్లు మారిపోయేవి. ధరణి పోర్టల్ తీసుకురావడంతో రైతుల పేరు మీద ఉన్న భూమిని మార్చడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ అయిన తరువాత కూడా డాక్యుమెంట్లు వెంటనే వచ్చేవి కాదు. డాక్యుమెంట్లు వచ్చిన తరువాత తహసీల్దార్ ఆఫీసులో ఎంట్రీ చేయించుకునేందుకు వీఆర్వో, అధికారుల చుట్టూ తిరగాల్సి ఉండేది. కానీ ధరణి వచ్చిన తరువాత అన్ని పనులు 10 నిమిషాల్లో పూర్తి అవుతున్నది.
– పంచలింగాల రామకృష్ణారెడ్డి, బాకారం జాగీర్, మొయినాబాద్
గతంలో అవకతవకలు జరిగేవి..
ధరణి పోర్టల్ రాక ముందు భూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగేవి. ఎప్పుడైనా భూమిని అమ్మేటప్పుడు, కొనేటప్పుడు గాని పహాణిలు తీసుకొని చూస్తే ఒకరి భూమి ఇంకొకరి పేరుపై ఉండేది. కొంత మంది దళారులు, అవినీతికి పాల్పడే వారు భూమిని ఎవరి పేరు మీదకు కావాలంటే వారి పేరనే ఎక్కించేవారు. సీఎం కేసీఆర్ ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ‘ధరణి’ని తీసుకొచ్చి భూమికి రక్షణ కంచె వేసిండు. భూ సంస్కరణలు, భూ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– చిందం సైదులు, రైతు, ఆరుట్ల
‘ధరణి’తో వివాదాలు పరిష్కారం
గతంలో రాత పద్ధతుల్లో ఉన్న రికార్డుల్లో వందలు, వేల మంది రైతులకు తెలియకుండానే అనేక మార్పులు, చేర్పులు గతంలో జరిగేవి. ఇరుగు పొరుగు వాళ్లు భూ వివాదాలతో అనేక పంచాయితీలు పెట్టుకొని ఘర్షణ దాకా పోయేటోళ్లు. వాటి పరిష్కారం కోసం కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగేటోళ్లు. ఇప్పుడు రికార్డులు డిజిటల్ చేయడమే కాకుండా, అనేక వివాదాలను పరిష్కరించారు. మున్ముందు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ధరణి పోర్టల్ పరిష్కార మార్గానాకి వేదికైంది.
– ఆర్ల యాదయ్య, మంచాల
రెవెన్యూ వ్యవస్థలో ‘ధరణి’ విప్లవాత్మకం
రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన పలు సమస్యలకు ‘ధరణి’ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. సమస్యల్లో ఇరుక్కుపోయిన ఎంతో మందికి ‘ధరణి’ మేలు చేస్తున్నది. ఇందులో స్లాట్ బుకింగ్ల నుంచి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాసు పుస్తకాలు అందజేయడం మొదలైనవన్నీ చకచకా సాగిపోతాయి. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగే ప్రసక్తి ధరణి పోర్టల్లో లేదు. భూ వివరాలను ‘ధరణి’లో పొందుపర్చుకుంటే అవకతవకలు జరిగే అవకాశాలు ఉండవు. ఈ ధరణి వేదిక నుంచి చాలా సులువుగా, అర్ధగంటలో పట్టా పొందేందుకు ఆస్కారం ఉంది.
– కర్ర అనిత, మండల రెవెన్యూ అధికారి, మంచాల మండలం