కడ్తాల్ : మండల కేంద్రంలోని భూనీలా సహిత లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో గురువారం గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని కొబ్బరి, మామిడాకుల తోరాణాలతో, రంగురంగుల పూలతో శోభయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి వారికి శుద్ధజలం, పంచామృతాలతో అభిషేకించి, ఆలయ ప్రధాన అనువంశీకుల అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలహారాలతో గోదాదేవి, రంగానాథస్వామి వారి విగ్రహాలను అందంగా అలంకరించారు. ఆలయానికి అలంకరణతోపాటు స్వామి వారికి పట్టు వస్త్రాలను బాచిరెడ్డి మంజుల, నరేందర్రెడ్డి దంపతులు సమర్పించగా… పుస్తె మెట్టెలను మాధవి, రమేశ్చారి దంపతులు అందజేశారు.
అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, ముత్యాల తలంబ్రాలతో గోదాదేవి, రంగనాథస్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిగింది. భక్తులు స్వామి వారిని దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు నరేందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, చందోజీ, ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.