బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.18 కోట్ల నిధులతో 70 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్డు విస్తరణ, మల్లాపూర్లో బురుజు సుందరీకరణ, మున్సిపల్ డివిజన్ కార్యాలయ నిర్మాణం, బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ తదితర పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలు పండుగ వాతావరణంలో కొనసాగాయి.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో సుడిగాలి పర్యటన చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తన స్వగృహం నుంచి పర్యటనను మొదలుపెట్టిన మంత్రి రాత్రి వరకు అవిశ్రాంతంగా పర్యటించారు. ఒకటి.. రెండు.. మూడు కాదు..70 కార్యక్రమాలకు మంత్రి ఒకే రోజు శ్రీకారం చుట్టారు. బడంగ్పేట్ మున్సిపాలిటీలో రూ.12.08కోట్ల విలువ గల 43 పనులకు, మీర్పేట్ మున్సిపాలిటీలో రూ.5.92కోట్ల విలువ గల 27 అభివృద్ది పనులకు మంత్రి సబితా శంకుస్థాపన చేశారు. మంత్రి ఓపిక, ఆసక్తికి ప్రజానీకం, అధికారులే కాదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే ఆశ్చర్యపోయేలా ఉత్సాహంగా మంత్రి పర్యటన సాగింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పర్యటన ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో 8, 9, 11, 14, 17, 19, 34, 37, 38, 41, 42, 43, 46, 44, 23, 25, 26, 27 డివిజన్లలో రూ.5.92కోట్లను వెచ్చించి నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10, 11, 12, 13, 14, 15, 16, 20 డివిజన్లలో పConstruction of లు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం, సీసీ రోడ్డు విస్తరణ, మల్లాపూర్లో బురుజు సుందరీకరణ, మున్సిపల్ డివిజన్ కార్యాలయ నిర్మాణం, బాలాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ వంటి పనులకు శంకుస్థాపనలు చేశారు.
శంకుస్థాపన కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఆయా డివిజన్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఆదివారం రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాగిన పర్యటనలో మంత్రి ఓపికగా, ఆసక్తిగా శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్లలో కలియతిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వినతులు, విన్నపాలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజానీకం పలు సమస్యలను ఏకరువు పెట్టగా తక్షణమే పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏకకాలంలో విసుగు అనేది లేకుండా అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ప్రజానీకం మంత్రికి అడుగడుగునా నీరాజనం పలికింది.
మహేశ్వరం నియోజకవర్గంలో పల్లెల అభివృద్ధితోపాటు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేసిన సందర్భంగా మాట్లాడారు. ట్రంక్ లైన్లు, నాలాల నిర్మాణాలను చేపట్టి వర్షాకాలంలో వరద ముంపు నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ.110కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.210కోట్లతో మిషన్ భగీరథ పథకంలో పైపు లైన్ల నిర్మాణం, ట్యాంకులు, రిజర్వాయర్లను నిర్మించి తాగునీటి సమస్య అనేదే లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి, తుక్కుగూడ పరిధిలో రూ.40కోట్ల నిధులతో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు వివరించారు.
ఓ వైపు అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంతో చేపడుతూనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పింఛన్, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలతోపాటు చేతి వృత్తులకు ఇతోధికంగా సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ వర్గాలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకుంటున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, యెగ్గే మల్లేశం, మేయర్లు దుర్గా దీప్లాల్ చౌహాన్, పారిజాత, డిప్యూటీ మేయర్లు తీగల విక్రమ్రెడ్డి, ఇబ్రాం శేఖర్, ఫ్లోర్ లీడర్లు భూపాల్రెడ్డి, అర్జున్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కామేశ్, రాంరెడ్డి, మాజీ అధ్యక్షులు లావణ్య, భూపేశ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు.