ఇబ్రహీంపట్నం : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో 154 సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు రూ. 6.80కోట్లు, 5 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ. 1.25కోట్లు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పంచాయతీరాజ్ నిధులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయనున్నట్లు తెలిపారు. మంజూరు చేసిన నిధులతో మార్చి నెలాఖరులోగా పనులు పూర్తయ్యేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ నిధులతో ఇబ్రహీంపట్నం మండలంలో రూ. కోటి నిధులతో 25 సీసీ రోడ్లు, మంచాల మండలంలో రూ. 1.70కోట్లతో 40సీసీ రోడ్లు, యాచారం మండలంలో రూ. 2.20కోట్ల నిధులతో 49 సీసీరోడ్లు, అబ్దుల్లాపుర్మెట్ మండలంలో రూ. 2కోట్ల వ్యయంతో 40 సీసీరోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. రాయపోల్, కప్పపహాడ్, ఎలిమినేడు, ఆంబోతుతండా, పటేల్చెర్వు తండా గ్రామాల్లో ఒక్కొక్కటీ 25 లక్షల వ్యయం చొప్పున మొత్తం రూ. 1.25కోట్ల నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మిగతా గ్రామ పంచాయతీ భవనాలకు సైతం నిధులు మంజురు చేసేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు.