షాద్నగర్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలను నగరాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వందలకోట్లను వెచ్చిస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వర నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 3.65కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక వసతలు సమకూరాయని, విద్యుత్ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభించిందని తెలిపారు.
అన్ని మున్సిపాలిటీలు చెత్త రహిత మున్సిపాలిటీలుగా మారేందుకు పాలకులు, ప్రజలు సహకారం అందించలన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 1,2,3,21,22,32వ వార్డుల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. అదే విధంగా 3,4,5వ వార్డుల్లో కోటి రూపాయాలను వెచ్చించి సీసీరోడ్లు, వాటర్ పైపులైన్ పనులను ప్రారంభించామన్నారు. శివారు ప్రాంతాల్లో రూ. 12వందల కోట్లతో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చిన్నారులతో కలిసి పలు కాలనీల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.