కొండాపూర్, అక్టోబర్ 2 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం పేదలకు వరమని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్నదని, మరిన్ని ఇండ్లు మంజూరయ్యేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు.
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే 2819 డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించగా, వీరిలో దివ్యాంగులు 70 మంది, ఎస్సీలు 479 మంది, ఎస్టీలు 169 మంది, జనరల్ కేటగిరీలో 2101 మంది ఎంపికయ్యారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలిసి బటన్ నొక్కి లబ్ధిదారులకు నల్లగండ్ల, హఫీజ్పేట్లో నిర్మించిన అపార్ట్మెంట్లలోని ఇండ్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంగాధర్రెడ్డి, పూజితగౌడ్, మంజులారెడ్డి, జగదీశ్వర్గౌడ్, రోజాదేవి, శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, జడ్సీ శ్రీనివాస్రెడ్డి, డీసీ రజనీకాంత్రెడ్డి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.