షాబాద్, ఫిబ్రవరి 10: గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు వినియోగదారుల నుంచి వివరాలు సేకరిస్తునట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్కార్డు , రేషన్కార్డు, ఫోన్ నంబర్ వివరాలు తమ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఈ నెల 15వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఆయన వెంట లైన్మెన్లు జంగయ్య, పరశురాం, సిబ్బంది తదితరులున్నారు.
ఆమనగల్లు : ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆమనగల్లు విద్యుత్ శాఖ ఏఈ సీతారాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారుల ఇంటికి విద్యుత్ సిబ్బంది వచ్చినప్పుడు రేషన్ కార్డు, ఆధార్కార్డు, ఫోన్ నంబర్ వివరాలు అందించి బిల్లింగ్ మిషన్లో నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇంటి వద్ద వివరాలు నమోదు చేసుకోనివారి కోసం ప్రత్యేకంగా ఆమనగల్లు పట్టణంలోని గాంధీ చౌక్ చౌరస్తాలో ఉన్న విద్యుత్ వినియోగదారుల కేంద్రంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
కడ్తాల్, ఫిబ్రవరి 10 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రవేశపెట్టిన గృహాలక్ష్మి పథకం అమలుకు, విద్యుత్ శాఖ అధికారులు చేపట్టిన సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. రీడింగ్ కోసం వచ్చే అధికారులకు వినియోగదారులు సహకరించాలని ఏఈ నరేందర్ కోరారు. కార్యక్రమంలో నాయకులు రవి, ఇమ్రాన్బాబా, రాజేందర్, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.