పెద్దేముల్, డిసెంబర్ 15 : మధ్యాహ్న భోజనం సరిగా లేక 14 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు చేసుకుంటుంటే పాఠశాలలో 18 మంది ఉపాధ్యాయులు ఉండి ఏమి చేస్తున్నారని హెచ్ఎం రాములుపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎండీఎం ఏజెన్సీ నిర్వాహకులతో వేర్వేరుగా మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీఈవో పాఠశాల సిబ్బందితో మాట్లాడుతూ.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనంలో మార్పు రాకపోతే పేరెంట్స్ మీటింగ్ పెట్టి సర్పంచ్, ఎస్ఎంసీ కమిటీ ఆధ్యర్యంలో ఏజెన్సీని మార్పు చేయాలని సూచించారు. విద్యార్థులకు అస్వస్థత లాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హెచ్ఎం రాములుకు మెమో జారీ చేసి వివరణ కోరుతామన్నారు.
భోజనానికి సంబందించి మెనూ బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు, పాటించాలని సూచించారు. 441 మంది విద్యార్థులకు 75 వేల స్కూల్ గ్రాంట్ వస్తున్నదని.. అందులోనే మూత్రశాలలు, పారిశుధ్య పనులు చేసుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని 6, 10 ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు గణిత, భౌతిక శాస్ర్తాలకు సంబంధించి ప్రశ్నలువేస్తూ జవాబులు రాబట్టారు. అనంతరం పాఠశాలలో సంపు నిర్మాణ పనులను ముగ్గు వేసి ప్రారంభించారు.