కొడంగల్, ఫిబ్రవరి : పది పరీక్షల్లో 100శాతం ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో రేణుకాదేవి ఆదేశించారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల ప్రభుత్వం, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి వార్షిక పరీక్షలకు ఇంకా కొన్ని రోజుల మాత్రమే సమయం మిగిలి ఉందన్నారు. కాబట్టి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు.
గత సంవత్సరం చాలా తక్కువశాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. ఈసారి ప్రభుత్వ బడుల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా చదువులను కొనసాగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు స్లిప్ టెస్ట్లు నిర్వహించాలన్నారు. పరీక్ష పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థులు చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఒక టైంటేబుల్ ఏర్పాటు చేసుకొని చదువుకునే విధంగా విద్యార్థులకు సూచనలు చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల పురోగతిపై చర్చించుకోవాలని సూచించారు.
ఇప్పటి నుంచే విద్యార్థులకు వార్షిక పరీక్షల వాతావరణాన్ని గుర్తించే విధంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. తద్వారా వారిలో పరీక్షలపై భయాన్ని తొలగించే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. బట్ట్టీ విధానం కాకుండా విద్యార్థులు సొంతంగా ఆలోచించి పరీక్షలు రాసే విధంగా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గితే అది ఉన్నత విద్యపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులు ఎటువంటి సెలవులను తీసుకోవద్దని ఆదేశించారు.
అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడంతోపాటు వంట ఏజెన్సీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆచరించాల్సిన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం డీఈవో పదో తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. టీవీ, సెల్ఫోన్ల దూరంగా ఉండాలన్నారు. చదువులపైనే శ్రద్ధ వహిస్తే విజయం తప్పక వరిస్తుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో రాంరెడ్డితో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.