పరిగి, ఫిబ్రవరి 3 : పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి సూచించారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఈవో రేణుకాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు అదనపు తరగతులు, స్లిప్ టెస్ట్లు నిర్వహించి వారి అభ్యాసన స్థాయిని అంచనా వేసి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు తగు సూచనలు చేస్తూ వారు ముందంజ వేసేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులను అడిగి విద్యార్థుల చదువు స్థాయిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండలాల విద్యాధికారులు హరిశ్చంద్ర, హబీబ్, హెచ్ఎంలు పాల్గొన్నారు.