కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉమ్మడి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని నిరసనలు వెల్లువెత్తగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని భారీ ర్యాలీలు తీశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కొండాపూర్ ప్రభుత్వ దవాఖానలో వేతనాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని పలు సంఘాలు హెచ్చరించాయి.
పెద్దేముల్, ఫిబ్రవరి 16 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న ఫ్రీ బస్సు నిర్ణయంతో లక్షలాది ఆటోడ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ఆటో జేఏసీ పిలుపు మేరకు పెద్దేముల్లో రోడ్డుపై ధర్నా చేశారు. ఫ్రీ బస్సు నిర్ణయంతో ఆటోడ్రైవర్ల బతుకులు ఛిద్రమయ్యాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 25 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు నిత్యం రూ. 6, 7 వందలు సంపాదిస్తే.. ప్రస్తుతం రెండు వందలు కూడా రావడం లేదన్నారు. ఫ్రీ బస్సు పథకాన్ని రద్దు చేయాలని, లేదంటే నెలకు రూ.15 వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. ఆటోవాలాల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో పెద్దేముల్ మండల ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్మీది శ్రీనివాస్, సలహాదారుడు ఆర్.మల్లప్ప, ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ మండల వైస్ ప్రెసిడెంట్ ఎండీ.మోజం, కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.