మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో పహాడీషరీఫ్ ప్రీమియర్ ఫంక్షన్హాల్ జరిగిన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డల సంతోషం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్ల సేవలు ఎంతో గొప్పవని, వారు సమాజంలో అమ్మ పాత్ర పోషిస్తున్నారన్నారు. సర్కారు చేయూతతో మహిళలు వ్యాపారాల్లో రాణిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం గౌలికర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో జరిగిన ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మహిళలకు సర్కార్ అందిస్తున్న సేవలను వివరించారు. పలు చోట్ల మహిళా సంఘాలకు రుణాలను అందజేయగా, ఉత్తమ సేవలందించిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేసి, ఘనంగా సన్మానించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పహాడీషరీఫ్, జూన్ 13 : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధి పహాడీషరీఫ్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మజాకుమారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. మహేశ్వరం ఎంపీడీవో నర్సింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మజాకుమారి మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంటి ఆడబిడ్డ సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్య తొలగించడానికి కేరళ రాష్ర్టానికి 11 మంది మహిళ ఐఏఎస్ అధికారులను పంపి న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని నిర్ణయించి.. మొదటగా 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారన్నారు. 14న జరుగబోయే తెలంగాణ ఆరోగ్య వైద్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
48 లక్షల మంది పెన్షన్దారుల్లో 28 లక్షల మంది మహిళలే..
అశా కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్ల సేవలు ఎంతో గొప్పవని.. వారు సమాజంలో అమ్మ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ 9 ఏండ్లలో 12వేల మంది ఐకేపీ గ్రూపుల మహిళలకు స్త్రీ నిధి ద్వారా రూ.లక్ష చొప్పున చిరు వ్యాపారాలు చేయడానికి అందించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్కు మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 48 లక్షల మంది పెన్షన్దారుల్లో 28 లక్షల మంది మహిళలే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. బిడ్డ పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. ఇప్పటివరకు రూ.13 లక్షల కేసీఆర్ కిట్లు అందించినట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో 15వేల మందిలో షాదీముబారక్ కింద 3వేల మందికి అందించినట్లు తెలిపారు. షీ టీంతో మహిళలకు భరోసా లభించిందన్నారు. మహిళలు సైబర్ నేరాలతో పాటు ఇతర మోసాలపై రాచకొండ కమిషనరేట్లో అందుబాటులో ఉన్న 8712662662 హెల్ప్ లైన్ నంబర్ ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతారన్నారు. సమస్యలను పరిష్కరిస్తారని ఆమె పేర్కొన్నారు.
ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే
రూ.540 కోట్ల రుణాలు
ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే రూ.540 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందించినట్లు మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా, ఆత్మగౌరవంగా జీవించడానికి వారికి అండగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. అనంతరం 137 మందికి షాదీముబారక్ చెక్లను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన మహిళలకు ప్రశంసాపత్రాలు అందించి సన్మానం చేశారు. మహిళా సంఘాలకు
రుణాల చెక్కులను అందించారు.
కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో సూరజ్కుమార్, బాలాపూర్ తహసీల్దార్ జనార్దన్రావు, జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లాసాదీ, వైస్ చైర్మన్ ఫర్హ్హానా నాజ్, కమిషనర్లు నాగేశ్వర్రావు, వసంత, డీఈ వెంకన్న, ఏఈ అయేషా, జడ్పీటీసీ జంగారెడ్డి, కౌన్సిలర్లు రాధిక, షేక్ వహీదా బేగం, శంషోద్దీన్, లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, కృష్ణారెడ్డి, యూసుఫ్ పటేల్, జనార్దన్, షేక్ అఫ్జల్, అర్జున్, బర్కత్ అలీ, మన్నన్, సోషల్ మీడియా కన్వీనర్ వాసుబాబు పాల్గొన్నారు.