వికారాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఎరువుల విక్రయంలో డీలర్లు దోపిడీకి పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుంటున్న డీల ర్లు అందిన కాడికి దోచుకుంటున్న ట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభు త్వం డీఏపీ బస్తా ధరను రూ. 1,350గా నిర్ణయించగా, డీలర్లు మాత్రం ఏకంగా రూ.400 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. డీఏపీతోపాటు ఎన్పీకే ఎరువునూ కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్టు రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటికే డీఏపీపై రూ.400 నుంచి రూ.500 అధికంగా వసూలు చేస్తుండగా, ఎన్పీకే ఎరువును తీసుకుంటే అదనంగా మరో రూ.వెయ్యి వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. డీఏపీ కొరతతోపాటు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాకు వచ్చిన స్టాక్ను కొనుగోలు చేయడంతో ఎక్కడికి వెళ్లినా నో స్టాక్ అంటూ చెప్తుండటం గమనార్హం.
ఇదే పరిస్థితి కొనసాగితే డీఏపీ కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉన్నది. మరోవైపు కొందరు డీలర్ల వద్ద స్టాక్ అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్టు సమాచారం. జిల్లాలో వానకాలం సీజన్కుగాను 21,836 టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేయగా, జిల్లాలో ఇప్పటివరకు కేవలం 4,500 టన్నులు విక్రయించగా, ప్రస్తుతం జిల్లాలో 1,070 టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నది. మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుందనే విషయమై సంబంధిత అధికారులకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.