సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకు సాగుతున్న సర్కార్ తీరుతో నది మనుగడకే ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు, ఇంజినీర్లు, విద్యార్థి, ప్రజా సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరిట రియల్ ఎస్టేట్ కార్యాకలాపాలకు తావిస్తున్న సర్కార్.. పేదల భూములను బడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుపై అనుమానంతో పలు వేదికలపై సర్కార్ వైఖరినీ, లోపాభూయిష్టంగా మారిన ప్రాజెక్టు విధివిధానాలపై రిటైర్డ్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొంటూ మేథోమధనం చేస్తూనే ఉన్నారు.
గడిచిన రెండు నెలల కాలంగా అన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు, పర్యావరణ పరిరక్షకులు అంతా ఏక తాటిపైకి వచ్చి… కాంగ్రెస్ అశాస్త్రీయ ప్రాజెక్టును తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, హైడ్రోలాజికల్ స్టడీ, సామాజిక ప్రభావ నివేదిక, ప్రజల ముందు ఉంచకుండా సూచనలు కోరడం హాస్యాస్పదం అని కమిటీ సభ్యులు ధ్వజమెత్తారు. ఏప్రిల్ 12 మధ్యాహ్నం 12గంటల లోపు అన్ని పత్రాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలనీ, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు.
మరోవైపు మూసీ తీరంలోని బస్తీల ప్రజలను ఖాళీ చేయించడంపై విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే సమరశంకం పూరించాయి. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బస్తీ బాట 50 బృందాలుగా విడిపోయిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించేలా విస్తృతంగా పర్యటిస్తున్నాయి. ఇక నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను లక్షలాది మంది పేదల పొట్టకొట్టి చేస్తున్న ఈ సుందరీకరణ ఎవరి కోసం అని ప్రశ్నిస్తున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును హడావుడిగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు.
ప్రజాధనాన్ని నిర్వీర్యం చేసే అశాస్త్రీయ విధానాలతో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టేలా ఉందని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకత లేకుండా పునర్జీవం అసాధ్యమని, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయకుండా, నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా కాంక్రీట్ కట్టడాలు నిర్మించడం సరికాదని, మూసీ నదిని కేవలం రియల్ ఎస్టేట్ కారిడార్గా కాకుండా, పర్యావరణ వనరుగా మాత్రమే చూడాలంటున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయాలని, పారదర్శకంగా ప్రాజెక్టు నిర్మాణం జరగాలని మేధావులు, విద్యార్థి సం ఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.