దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. దళితబంధు పథకం కింద ఇచ్చిన రూ.10 లక్షలతో వాహనాలు కొనుగోలు చేసి, వ్యాపారాలు, దుకాణాలు పెట్టుకుని ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. నాడు కూలీపని చేసిన వారు.. మినీ డెయిరీ, పౌల్ట్రీ ఫాం, కార్లు, ట్రాక్టర్లు తదితరాలు కొనుగోలు చేసి నేడు ఓనర్లుగా మారుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుత కింద 358 యూనిట్లు మంజూరు కాగా, గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఇందుకు రూ.35.80 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా, ఇందులో రక్షణ నిధి కింద రూ.35.80 లక్షలను జమ చేశారు. రెండో విడుతకు సంబంధించి నియోజకవర్గానికి 500 యూనిట్ల చొప్పున మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. త్వరలో లబ్ధిదారులు ఎంపిక కాగానే యూనిట్ల గ్రౌండింగ్ను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
వికారాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకం అమలుతో జిల్లాలోని దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. మొన్నటి వరకు కూలీ పనిచేసి జీవనోపాధి పొందినవారు.. దళిత బంధు పథకంలో భాగంగా రూ.10లక్షల విలువచేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. దళిత బంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసినవారు.. నేడు ఓనర్లు, గతంలో రోజువారీ కూలీలు.. నేడు యజమానులయ్యారు. జిల్లాలో మినీ డెయిరీ, పౌల్ట్రీఫామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు.
దళిత బంధు లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారాల్లో ఏ విధంగానైనా నష్టపోయినట్లయితే వారిని ఆర్థికంగా అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన రక్షణ నిధి కింద ఇప్పటివరకు రూ.35.80 లక్షలను సంబంధిత అధికారులు జమ చేశారు. మరోవైపు మొదటి విడుతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, జిల్లాకు రూ.35.80 కోట్ల నిధులను విడుదల చేయగా, 358 యూనిట్లకు సంబంధించి అధికారులు గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మొదటి విడుతలో మంజూరైన యూనిట్లలో వికారాబాద్ నియోజకవర్గంలో 100, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్లో 60, చేవెళ్లలో 18 యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. రెండో విడుతకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గానికి 500 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్నది.
మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది
నా పేరు సుజాత. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం. గతంలో ఓ పరిశ్రమలో రోజువారీకూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాను. రోజుకు రూ.300 చొప్పున కూలీ డబ్బులను చెల్లించేవారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సీఎం కేసీఆర్ మా కోసం తీసుకువచ్చిన దళిత బంధు పథకంతో కూలీ పని మానేసి బట్టల దుకాణాన్ని ప్రారంభించి యజమానినయ్యాను. నెలకు రూ.20వేల వరకు సంపాదిస్తున్నాను. మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నది. సీఎం సారుకు ప్రత్యేక ధన్యవాదాలు.
రోజుకు రూ.2వేలు సంపాదిస్తున్నా..
నా పేరు బ్యాగరి రాజు. కెరెళ్లి గ్రామం, ధారూరు మండలం. దళిత బంధు పథకంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మూడు పూటలా కడుపు నిండా భోజనం చేస్తూ జీవిస్తున్నాం. గతంలో మేము(భార్యాభర్తలం) ఇద్దరం రోజు కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటిమి. మాకు వ్యవసాయం చేసుకునేందుకు గుంట భూమి కూడా లేదు. నేను ప్రతి రోజూ అడ్డామీది కూలీపనికి వేళ్లేవాడిని, రోజు పని చేస్తేగాని జేబులో డబ్బులు ఉండేవికావు. కనీసం హోటల్లో చాయి తాగడానికి డబ్బులు ఉండేవి కాదు. రోజు కూలీ చేసి మేము మా ఇద్దరు పిల్లలను పోషించుకునేవాళ్లం. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలు ఇవ్వడంతో నేను ట్రాక్టర్ కొన్నాను. ప్రస్తుతం ట్రాక్టర్తో ప్రతిరోజూ సుమారు రూ.2-3 వేలు, సీజన్లో అయితే రూ.5-6 వేల వరకు వస్తుంది. ప్రస్తుతం దళిత బంధు పథకంతో మా ఇంటిల్లిపాది ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నాం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
దళిత బంధుతో అభివృద్ధి
నా పేరు నల్లమల కృష్ణయ్య. కులకచర్ల మండలం బొంరెడ్డిపాలెం. దివ్యాంగుడనైన నేను గతంలో ఆటో నడిపిస్తూ ఇబ్బందులు పడేవాడిని. ఆటో నడపడానికి కూడా ఇబ్బంది ఉండేది. దీంతో మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నాను. అయినా ఆర్థికంగా డబ్బులు లేక వృథాగా ఉంటుండేవాడిని. సర్పంచ్ అంజిలయ్య ఆధ్వర్యంలో దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యేగారు మా గ్రామానికి పెట్టడంతో సర్పంచ్ నా పేరును ప్రపోజ్ చేశారు. దీంతో నాకు దళిత బంధు కింద రూ.10లక్షలు మంజూరయ్యాయి. మొబైల్ రిపేరింగ్తోపాటు మొబైల్ దుకాణాన్ని కులకచర్లలో పెట్టుకొని ప్రతిరోజూ వచ్చే ఆదాయంతో జీవనం కొనసాగిస్తున్నా. ప్రతిరోజూ ఖర్చులుపోను రూ.2వేల వరకు సంపాదించుకుంటున్నాను. నాకు జీవోనోపాధి చూపించిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. నాలాంటివారు ఎందరికో దళిత బంధు ఎంతగానో ఉపయోగపడుతున్నది.