వికారాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి మానవీయ కోణంతో అమల్లోకి తీసుకొచ్చిన పేద పిల్లలకు వరంలాంటి సీఎం అల్పాహార పథకం ప్రారంభమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ఒక్కో పాఠశాలలో సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ శివారెడ్డిపేట్ ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో కలిసి రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించగా, తాండూరు నియోజకవర్గంలోని తాండూరు మండలం గౌతాపూర్ పాఠశాలలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం మన్నెగూడ ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలు ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి కొడంగల్ పట్టణంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో స్థానిక ప్రజాప్రతినిధులు పథకాన్ని ప్రారంభించారు.
వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట్ ప్రాథమిక పాఠశాలలో సీఎం అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి మహేందర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ బ్రేక్ ఫాస్ట్ చేశారు. శుక్రవారం జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో 602 మందికి అల్పాహారం అందించారు. దశల వారీగా మిగతా ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఒక్కో రోజు ఒక్కో వెరైటీ అల్పాహారాన్ని ఉదయం 8.45 గంటల నుంచి విద్యార్థులకు అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంతో తీసుకువచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు, జిల్లాలోని 1051 స్కూళ్లలోని 92 వేల మంది విద్యార్థులకు సీఎం అల్పాహారం అందనుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల స్వరూపం పూర్తిగా మారిపోయి విద్యాహబ్గా తెలంగాణ అవతరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
వికారాబాద్, అక్టోబర్ 6 : సీఎం అల్పాహారం పథకం అద్భుతంగా ఉందని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట పాఠశాలలో సీఎం అల్పాహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ సి.నారాయణరెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, ఎంఈవో బాబుసింగ్, కౌన్సిలర్ నస్రిన్ భేగం, ప్రవళిక, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనంత్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.