షాబాద్, సెప్టెంబర్ 30: కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులను పాటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింకర్ల ప్రాముఖ్యతపై రైతులకు ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో ఆ పద్ధతిలో పంటలు పండిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. ప్రభుత్వం పందిరిసాగు ద్వారా కూరగాయలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.లక్ష వరకు సబ్సిడీ అం దించడంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు. ఇందులో కాకర, బీర, దొండ, సోరకాయలున్నాయి. ఈ విత్తనాల ను నాటిన కొద్ది రోజులకే పంట చేతికి వస్తుండటంతో మార్కెట్లో మంచి ధర పలుకుతున్నది. పెట్టుబడి పోను రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 1,500 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు పంటల సాగుపై, ప్రభు త్వం అందిస్తున్న సబ్సిడీపై వారు అవగాహన కల్పిస్తున్నారు.
పందిరి సాగుపై ఆసక్తి..
జిల్లాలో అత్యధికంగా షాబాద్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, షాద్నగర్, మహేశ్వరం, కందుకూరు మండలా ల్లోని రైతులు పందిరి సాగు ద్వారా కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇందులో కాకర, బీర, సోర, చిక్కుడు వంటి పంటలున్నాయి. ఏడాది లో రెండుసార్లు సోరకాయ పంట దిగుబడి వస్తుంది. ఎకరానికి రూ.ఆరు వేల వరకు ఖర్చు కాగా, సుమారు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో సోరకాయ కిలోకు రూ. 20 -రూ. 25 వరకు పలుకుతున్నది. దీంతో ఆదాయం నెలలో రూ. 50 వేల వరకు వస్తుం ది. బీర, చిక్కుడు పంటలకు ఎకరానికి రూ. 25వేల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మొత్తానికి పందిరి సాగు ద్వారా ఎకర పొలంలో కూరగాయలను సాగు చేస్తే రైతులకు ఏడాదికి దాదాపుగా రూ. 2లక్షల వరకు ఆదాయం వస్తున్నది.
జిల్లాలో 1,500 ఎకరాల్లో సాగు..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఆమనగల్లు, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో ఈ ఏడాది వానకాల సీజన్లో రైతులు 1,500 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా వివిధ రకాల కూరగాయల సాగు చేశారు. ప్రభుత్వం ఎకరానికి రూ.లక్ష చొప్పున 250 మందికి చెందిన 550 ఎకరాల వరకు సబ్సిడీని అందించింది. ఏడాది పొడవునా కూరగాయలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందుతున్నామని రైతులు చెబుతున్నారు.