పుష్కలంగా సాగునీరు.. అదునుకు పెట్టుబడి సాయం.. సరిపడా విత్తనాలు, ఎరువులు.. నిరంతరం నాణ్యమైన విద్యుత్.. పండించిన పంటలకు మద్దతు ధర అందిస్తూ తెలంగాణ సర్కార్ వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్నది. ఫలితంగా రంగారెడ్డి జిల్లాలో ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. 2014 సంవత్సరంలో జిల్లాలో 1.41లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా.. 2022 వానకాలంలో 3,43, 001 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంతేకాకుండా ఈ వానకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 4,04,081 ఎకరాలు కాగా.. 4,87,631 ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఈ లెక్కన తొమ్మిదేండ్లలో జిల్లాలో సాగు విస్తీర్ణం మూడింతలకు చేరింది. సీఎం కేసీఆర్ హయాంలో రైతు రాజుగా వెలుగొందుతున్నాడు. ఒకప్పుడు దండగ అనుకున్న వ్యవసాయం.. నేడు పండుగలా సాగుతున్నది.
రంగారెడ్డి, జూలై 7(నమస్తే తెలంగాణ): పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాలకు భరోసా.. వెరసి రాష్ట్ర ఏర్పాటుకు ముందు సాగు పరంగా ఉన్న ఇబ్బందులన్నీ నేడు జిల్లాలో కనుమరుగయ్యాయి. 2014లో కేవలం 1.4 లక్షల ఎకరాల్లోనే సాగైన పంటల విస్తీర్ణం.. గడిచిన తొమ్మిదేండ్లలో మూడింతలు అంటే 4.87 లక్షల అంచనాకు చేరడం వ్యవసాయ పరంగా వచ్చిన పెను మార్పులకు అక్షర సత్యంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ కలల రాజ్యంలో ఇప్పుడు రైతే రాజు. ఒకప్పుడు దండగ అనుకున్న వ్యవసాయం.. రైతుబంధు పథకం మొ దలైన తర్వాత ఓ పండుగలా సాగుతున్నది. ఒకప్పుడు బీడుగా పడి ఉన్న భూములు సైతం నేడు సాగులోకి రావడంతో జిల్లాలోని రైతు కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయి.
ముమ్మరంగా సాగు ..
రైతుబంధు పేరిట ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం వ్యవసాయ రంగంలోని విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. సీజన్కు ముందే ఎరువులు, విత్తనాలను సిద్ధంగా ఉంచుకునేందుకు ఎంతో దోహదపడుతున్నది. పెరిగిన దిగుబడుల నేపథ్యంలో.. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరతో రైతులకు నష్టాలనేవే లేకుండా పోయాయి. 2018 నుంచి పది విడుతలుగా ప్రభుత్వం రైతుబంధు కింద జిల్లా రైతులకు రూ.3,017.91 కోట్లను అందించింది. ప్రస్తుత వానకాలంలో 3,94,066 మంది రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సా యంగా రూ.378.95 కోట్లను అందిస్తున్నది. సీజన్కు ముందే చేతిలో డబ్బు ఉండటంతో రైతులకు అప్పుల వేట అవసరం లేకుండా పో యింది. షావుకారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నేడు లేదు. అదేవిధంగా ‘మిష న్ కాకతీయ’లో నాలుగు విడుతల్లో మొత్తం 956 చెరువులను రూ.132.95 కోట్లతో ప్రభుత్వం బాగు చేయడంతో నేడు భూ గర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాలాలతో సంబంధం లేకుండా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో సాగు నీటికి సైతం ఢోకా లేకుండా పోయింది. వర్షం పడిన మరుక్షణమే.. రైతు ధ్యాస అంతా వ్యవసాయంపైనే!. పెట్టుబడుల బెంగ లేకుండా ఎరువులు, విత్తనా ల కొనుగోళ్లలో రైతన్నలు బిజీబిజీగా ఉంటున్నా రు. ఒకప్పుడు వ్యవసాయం అంటేనే వెనుకడుగు వేసే పరిస్థితులు ఉండగా.. నేడు రైతు కుటుంబాలు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయానికి సన్నద్ధ్దమవుతున్నాయి. కాగా ప్రస్తుత వానకాలంలో వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగు 52,842 ఎకరాల్లో మొదలైంది. ఇందులో సింహభాగం 41,601 ఎకరాల్లో పత్తి సాగైంది.
జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం..
రైతులు ఇష్టంతో పంటలను సాగు చేస్తున్నారని చెప్పడానికి గత తొమ్మిదేండ్లలో జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణమే నిదర్శనం. 2014-15లో జిల్లా లో కేవలం 1, 41,278 ఎకరాల్లో మాత్రమే వివి ధ రకాల పంటలు సాగయ్యేవి. 2022 వానకా లం నాటికి సాగు విస్తీర్ణం 3,43,001 ఎకరాలకు పెరిగింది. ప్రస్తుత వానకాలంలో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,04,081 ఎకరాలు కాగా.. 4,87,631 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీరు.. ఉచిత విద్యుత్తు వంటి పరిస్థితుల నేపథ్యంలో వలస వెళ్లిన ఎన్నో కుటుంబాలు సొంతూళ్లకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఎకరంలోనే సేద్యం చేసిన రైతులు నేడు పది ఎకరాల వరకు సాగు చేస్తున్నారు.