వికారాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ):వార్షిక రుణ ప్రణాళికను వికారాబాద్ జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. ఈ ఏడాది రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు కలిపి 2,74,895 మందికిగాను రూ.7,408 కోట్ల రుణాలను అందజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రూ.3,829 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రతి రైతుకూ పంట రుణం అందేలా జిల్లా ఉన్నతాధికారులు లీడ్ బ్యాంక్ మేనేజర్ను ఆదేశించారు. వానకాలం, యాసంగి సీజన్లలో రూ.2,582.24 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని ప్రణాళికను రూపొందించారు. పౌల్ట్రీ, డెయిరీ, మత్స్యకారులు, ఉద్యానవన, అటవీ భూ అభివృద్ధికి సంబంధించి 28,827 మంది రైతులకుగాను రూ.683.55 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 31,976 మందికిగాను రూ.1200 కోట్ల రుణాలివ్వాలని టార్గెట్గా నిర్ణయించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి లీడ్ బ్యాంకు అధికారులు విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు మంజూ రు చేసే రుణాల లక్ష్యాన్ని పెంచారు. అంతేకాకుం డా రైతులకు అందజేసే పంట రుణాలనూ హెచ్చించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.765 కోట్ల రుణాలను పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, పౌల్ట్రీ, మత్స్య, డెయిరీ, ఉద్యానవన రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు రూ.6,361.51 కోట్లు, ప్రాధ్యానేతర రంగాలకు రూ.1,046 కోట్ల రుణాలను మంజూ రు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రతి ఏటా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినా రుణాల మంజూరులో మాత్రం బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్య వహరించడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సా రించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులందరికీ రుణాలను మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ను ఆదేశించారు.
వార్షిక రుణ లక్ష్యం రూ.7408 కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సర వార్షిక రుణ లక్ష్యాన్ని రూ. 7,408 కోట్లుగా నిర్ణయించారు. ప్రాధాన్యత, ప్రా ధాన్యేతర రంగాలకు కలిపి మొత్తం 2,74,895 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యం గా నిర్దేశించారు. రుణ ప్రణాళికలో 85.87 శాతం రుణాలను ప్రాధాన్యత రంగాలకు కేటాయించగా, మిగతా 14.13 శాతం రుణాలను ప్రాధాన్యేతర రంగాలతోపాటు ఇతర రంగాలకు కేటాయించా రు. ఈఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.3,829 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రు. అయితే ప్రాధాన్యత రంగాలకు అత్యధికంగా రూ.6361.51 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,046 కోట్ల రుణాలను మంజూరు చేయాల ని నిర్ణయించారు. అదేవిధంగా పౌల్ట్రీ, డెయిరీ, మత్స్యకారులు, ఉద్యానవన, అటవీ భూఅభివృద్ధికి సంబంధించి 28,827 మంది రైతులకు రూ. 6,83.55 కోట్ల రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 31,976 మం దికి రూ.1,200 కోట్ల రుణాలిచ్చేందుకు టార్గెట్గా నిర్ణయించారు. వీటిలో సూక్ష్మతరహా పరిశ్రమల నుంచి రూ.23,658 మందికి రూ.591 కోట్ల రుణాలు, చిన్నతరహా పరిశ్రమలకు సంబంధించి 7,876 మందికి రూ.354 కోట్ల రుణాలు, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి 442 మందికి రూ.254 కోట్ల రుణాలు, ఇతర ప్రాధాన్యత రంగాల్లోని ఎడ్యుకేషన్ రుణాలకు సంబంధించి 3,168 మందికి రూ.158 కోట్ల రుణాలు, గృహరుణాలు 9,913 మందికి రూ.991 కోట్లు, పునరుత్పాదక శక్తి పరిశ్రమలకు నుంచి 4,528 మందికి రూ.90.61 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పంట రుణాలు రూ.2,582 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో వానకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి రూ.2,582.24 కోట్ల పంట రుణాలను జిల్లాలోని 1,78,522 మంది రైతులకు మంజూరు చేయాలని రుణ ప్రణాళికను రూపొందించారు. అయితే గతేడాదితో పోలిస్తే రూ.150 కోట్ల మేర రుణాలను పెంచాలని నిర్ణయించారు. గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలో రూ.2,433 కోట్ల రుణాలను 2,18,412 మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.1,847 (75 శాతం మేర) కోట్ల రు ణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు. అదేవిధం గా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధా న్యం ఇస్తుండగా.. పంట రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్హులైన ప్రతి రైతుకూ పంట రుణాలందేలా చర్యలు చేపట్టారు.